Begin typing your search above and press return to search.

ఖైదీ ఫంక్షన్ స్టేజ్ మీదకు పోలీసులు ఎందుకు?

By:  Tupaki Desk   |   8 Jan 2017 11:42 AM GMT
ఖైదీ ఫంక్షన్ స్టేజ్ మీదకు పోలీసులు ఎందుకు?
X
వేలాది మంది ఎంతో అభిమానంగా ఎదురుచూసిన మెగాస్టార్ 150 చిత్రం ఖైదీ నంబరు150 ప్రీరిలీజ్ ఫంక్షన్ గుంటూరు హాయ్ లాండ్ లో నిర్వహించటం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించటంతోపాటు.. తొమ్మిదేళ్ల గ్యాప్ ను పూడ్చేలా నిర్వహించాలని భావించారు. అందుకే.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగి.. దగ్గరుండి ఏర్పాట్లు చేశారు.

ఎంతో ప్లానింగ్.. మరెన్నో అంచనాల మధ్య నిర్వహించిన ఖైదీ ఫంక్షన్ ను చాలా త్వరగా ముగించటం చాలామందికి ఆశ్చర్యకరంగా అనిపించింది. సాధారణంగా సినిమాలకు సంబంధించిన ఆడియో ఫంక్షన్ కావొచ్చు.. మరే ఇతర కార్యక్రమాలు నిర్వహించినా రాత్రి తొమ్మిది నుంచి పది గంటల వరకూ నాన్ స్టాప్ గా జరిగే దానికి భిన్నంగా.. చాలా స్పీడ్.. స్పీడ్ గా ముగించేశారు.

అంతేనా.. ఎప్పుడూ లేని విధంగా.. ఖైదీ ఫంక్షన్ స్టేజ్ మీదకు పోలీసులు వచ్చేయటం.. అతిధులు.. చిత్రానికి సంబంధించిన సభ్యులతో పాటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున కనిపించారు. సాధారణంగా సినిమా కార్యక్రమాలకు ప్రైవేటుగా ఏర్పాటు చేసే బౌన్సర్లు ఎక్కువగా.. పోలీసులు తక్కువగా కనిపిస్తుంటారు. ఒకవేళ.. పోలీసులు వచ్చినా.. బయట సెక్యూరిటీ దగ్గర వారు కనిపిస్తారు తప్పించి.. స్టేజ్ మీదకు రావటం చాలా వరకూ ఉండదు.

అందుకు భిన్నంగా.. ఖైదీ స్టేజ్ మీదకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నరు. ఎందుకిలా అంటే.. ఊహించిన దాని కంటే ఎక్కువగా.. అంచనాలకు మించి వచ్చిన మెగా అభిమానుల కారణంగా వేదిక కిక్కిరిసిపోయింది. అన్నింటికి మించి చిరంజీవి మీద ఉన్న అభిమానంతో మెగా అభిమానుల సందడి ఎక్కడ శృతి మించి రాగాన పడుతుందన్న భయం పోలీసు అధికారుల్లో కనిపించింది. జన సందోహాన్ని కంట్రోల్ చేయటానికి వారు పడిన పాట్లు అన్నిఇన్ని కావు.

ఇలాంటి వేళ.. ఏ మాత్రం తేడా వచ్చినా.. తొక్కిసలాటకు ఎక్కువ అవకాశం ఉండటం.. అదే జరిగితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుందన్న భయం పోలీసు వర్గాల్ని వణికించింది. అందుకే.. ఫంక్షన్ ను త్వరగా పూర్తి చేయాలంటూ తొందరపెట్టేశారట. ఒకదశలో.. భారీగా వచ్చిన మెగా అభిమానుల విషయమై పోలీసు ఉన్నతాధికారులు అరవింద్ తో మాట్లాడారని చెబుతున్నారు. భారీగా వచ్చిన అభిమాన గణం కారణంగా శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమాన్ని వెనువెంటనే పూర్తి చేయాలన్న ఆదేశాల్ని జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ కారణంతోనే.. అతిధులతో మాట్లాడించాన్ని తగ్గించేసి.. ప్రముఖులు.. ముఖ్యుల చేతమూడు ముక్కల్లో ప్రసంగాలు పూర్తి చేయించాలని చెప్పటంతో.. కార్యక్రమాన్నిహడావుడిగా క్లోజ్ చేశారు. పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులు వేదిక వైపునకు దూసుకొచ్చే ప్రయత్నంచేయటంతో.. వారిని నిలువరించేందుకు వీలుగా వేదికపైకి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారని చెబుతున్నారు. తాపీగా ఫంక్షన్ చేసుకోవాలనుకున్న చిరు అండ్ కోకు.. ఈ లోటు మాత్రం వెంటాడేస్తుందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/