Begin typing your search above and press return to search.

గీతాగోవిందం డిస్ట్రిబ్యూట‌ర్ క‌క్కుర్తి..అడ్డంగా బుక్

By:  Tupaki Desk   |   21 Aug 2018 3:44 AM GMT
గీతాగోవిందం డిస్ట్రిబ్యూట‌ర్ క‌క్కుర్తి..అడ్డంగా బుక్
X
సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చినంత‌నే డిస్ట్రిబ్యూట‌ర్లు.. థియేట‌ర్ య‌జ‌మానులు ప‌డే క‌క్కుర్తి అంతా ఇంతా కాదు. తాజాగా ఇలానే చేసి అడ్డంగా బుక్ అయితే.. కేసుల చిక్కుల్లో చిక్కుకున్న ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైద‌రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రెడ్స్ సంధ్యా 70 ఎంఎం థియేట‌ర్ లో గీతాగోవిందం మూవీ రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాకు వ‌చ్చిన క్రేజ్ నేప‌థ్యంలో అమ్మాల్సిన ధ‌ర కంటే ఎక్కువ‌గా ధ‌ర‌కు టికెట్లు అమ్ముతున్న‌ట్లుగా కంప్లైంట్లు వ‌చ్చాయి.

దీంతో స్పందించిన స్థానిక పోలీసులు థియేట‌ర్ వ‌ద్ద దాడులు నిర్వ‌హించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుంచి 75 టికెట్లు.. రూ.6080 క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని విచారించ‌గా.. ఆస‌క్తిక‌ర అంశాలు తెర మీద‌కు వ‌చ్చాయి. థియేట‌ర్ య‌జ‌మానులు సుమిత్ సందీప్.. మేనేజ‌ర్ రామారావు.. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట‌ర్ త‌ర‌ఫు ప్ర‌తినిధి శంక‌ర్ తో పాటు సుబ్బ‌మ్మ అనే మ‌హిళ త‌మ‌కు టికెట్లు ఇచ్చి ఎక్కువ ధ‌ర‌కు అమ్మాల‌ని చెప్పార‌ని.. అలా అమ్మితే క‌మిష‌న్ ఇస్తామ‌ని చెప్ప‌టంతో తామీ ప‌ని చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు. దీంతో.. బ్లాక్ ధ‌ర‌ల‌కు టికెట్లు అమ్మేలా ప్రోత్స‌హించిన వారిపై కేసులు న‌మోదు చేశారు.

ఇక‌.. అధిక ధ‌ర‌ల‌కు టికెట్లు అమ్మాల‌ని ప్రోత్స‌హించిన ప్ర‌ధాన నిందితులు ప‌రారీలో ఉన్నార‌ని.. వారిని అదుపులోకి తీసుకుంటామ‌ని పోలీసులు చెబుతున్నారు. క‌క్కుర్తి ప‌డి.. ఇలా కేసుల్ని మీద వేసుకోవ‌టం అవ‌స‌ర‌మా అని..?