Begin typing your search above and press return to search.

ప‌వ‌న్.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ధ్య అంత వైర‌మా?!

By:  Tupaki Desk   |   5 Sep 2015 7:36 AM GMT
ప‌వ‌న్..  ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ధ్య అంత వైర‌మా?!
X
బ‌య‌టి ప్ర‌పంచానికి అంత‌గా తెలియ‌దు కానీ... భీమ‌వ‌రంలో ప్ర‌భాస్‌ - ప‌వన్‌క‌ళ్యాణ్ అభిమానుల మ‌ధ్య ఫైటింగ్ పెద్ద‌యెత్తున జ‌రుగుతోంది. ప‌రిస్థితి 144 సెక్ష‌న్ విధించేదాకా చేరింది. పోలీసు కేసులు, ఇన్వెస్టిగేష‌న్ల తో భీమ‌వ‌రం అట్టుడికిపోతున్న‌ట్టు స‌మాచారం. ఈ గొడ‌వంతా ఓ ఫ్లెక్సీ విష‌యంలో చోటు చేసుకొంద‌న్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి కార‌ణ‌మైంది. అభిమానులు ఒక‌రిపై ఒకరు గొడ‌వకి దిగారు. ఆ త‌ర్వాత రాళ్లు రువ్వుకొన్నారు. పోలీసులు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేసినా కొద్దిమంది అల్ల‌రి మూక‌లు ప్రయివేటు, ప్ర‌భుత్వ ఆస్తుల‌పై దాడి చేసి న‌ష్టం చేకూర్చిన‌ట్టు తెలిసింది. వ్య‌వ‌హారం అంత జ‌రిగాక పోలీసులు ఊరుకొంటారా? ఆ న‌ష్టానికి కార‌కులైన‌వారిని గుర్తుప‌ట్టేందుకు చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది. వాళ్ల‌పై కేసులు కూడా న‌మోదు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

అయినా ప్ర‌భాస్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ లు వివాదానికి ఆమ‌డ దూరం ఉంటారు. వాళ్లు ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడ‌తారు. ఒక‌రికి మంచి చేయాల‌ని చూస్తారు కానీ... నొప్పించే ప్ర‌య‌త్నం ఎప్పుడూ చేయ‌రు. ఇద్ద‌రి మ‌ధ్య కూడా మంచి అనుబంధమే ఉంది. అలాంటిది వారి పేరుతో ఫ్యాన్స్ గొడ‌వ‌కు దిగ‌డం ఎంతవ‌ర‌కు సమంజ‌సం అని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు మాట్లాడుకొంటున్నాయి. క‌థానాయ‌కుల మ‌ధ్య మంచి స్నేహానుబంధాన్ని పాడుచేసేలా అభిమానులు గొడ‌వ‌కు దిగ‌డం స‌మంజ‌సం కాద‌నీ, ఎవ‌రో ఒక‌రు స‌ర్దుకుపోతే అంతా ప్ర‌శాంతంగా అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉండొచ్చ‌ని ప‌రిశ్ర‌మ పెద్ద‌లు హిత‌వు ప‌లుకుతున్నారు. కొద్దిమంది స్వార్థ‌ప‌రులు ప‌వ‌న్‌, ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ధ్య కులం చిచ్చు కూడా ర‌గిల్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, అలాంటి మాట‌లు విని ఇబ్బందుల‌పాలు కావొద్ద‌ని కోరుతున్నారు పోలీసులు.