Begin typing your search above and press return to search.

దుమారం రేపుతున్న ప‌రేష్ రావ‌ల్ వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   23 May 2017 5:07 AM GMT
దుమారం రేపుతున్న ప‌రేష్ రావ‌ల్ వ్యాఖ్య‌లు
X
బాలీవుడ్ న‌టుడు ప‌రేష్ రావ‌ల్ సినీ రంగంలో ఎంత గౌర‌వాన్ని సంపాదించుకున్నారో రాజ‌కీయ రంగంలో అంత‌గా చెడ్డ‌పేరు తెచ్చుకుంటున్నారు. 2014 ఎన్నిక‌ల ముందు నుంచి మోడీ జపంలో త‌రించి పోతున్న ప‌రేష్ రావ‌ల్.. కొన్ని సంద‌ర్భాల్లో హ‌ద్దులు దాటి మాట్లాడారు. తాజాగా సామాజిక ఉద్య‌మ‌కారిణి.. ర‌చ‌యిత్రి అరుంధ‌తీ రాయ్ ను ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. కాశ్మీర్‌లో రాళ్లు విసిరిన ఒక యువకుడిని ఆర్మీ జీపుకికట్టిన సంఘ‌ట‌న‌ను ఉద‌హ‌రిస్తూ అరుంధతీ రాయ్ ను కూడా అలాగే ఆర్మీ జీపుకి కట్టేయాలని ప‌రేష్ ట్వీట్‌ చేశాడు. దీంతో దుమారం చెలరేగింది.

శ్రీనగర్ ఉప ఎన్నిక సందర్భంగా సెంట్రల్ కాశ్మీర్లోని బుద్గం జిల్లాలోని ఒక గ్రామంలో తమపై స్థానికులు రాళ్ల దాడికి ప్ర‌య‌త్నించ‌గా.. వారి నుంచి కాపాడుకునేందుకు ఓ కుర్రాడిని ప‌ట్టుకుని జీపు ముందు భాగానికి కట్టి తీసుకుపోయాయి భద్రతా దళాలు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. జమ్మూకశ్మీర్ ప్రతిపక్ష నేత‌ ఒమర్ అబ్దుల్లా దీనికి సంబంధించిన వీడియోను ట్విట్ట‌ర్లో షేర్ చేసి భ‌ద్ర‌తా ద‌ళాల‌పై తక్షణ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. అరుంధ‌తి కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతున్న నేప‌థ్యంలో ప‌రేష్ రావ‌ల్ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఐతే సీనియ‌ర్ న‌టుడై ఉండి.. ఎంపీగా బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉండి ఆయ‌న ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఆయ‌న స్థాయికి ఈ వ్యాఖ్య‌లు త‌గ‌వ‌ని జనాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.