Begin typing your search above and press return to search.

కోర్టు ఆర్డ‌ర్ః2 వేల కోట్లు క‌ట్ట‌కపోతే జైలుకే

By:  Tupaki Desk   |   27 April 2017 12:12 PM GMT
కోర్టు ఆర్డ‌ర్ః2 వేల కోట్లు క‌ట్ట‌కపోతే జైలుకే
X
స‌హారా చీఫ్ సుబ్ర‌తా రాయ్‌ కు సుప్రీంకోర్టు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది. జూన్ 15 లోపు రూ.2052 కోట్లు డిపాజిట్ చేయండి.. లేదా జైలుకెళ్లండి అని స్ప‌ష్టం చేసింది. ఈ మొత్తానికి తాను రెండు చెక్కులు ఇస్తాన‌ని ఈ సంద‌ర్భంగా సుబ్ర‌తారాయ్ కోర్టుకు తెలిపారు. ``చెక్కులు క‌చ్చితంగా ఇవ్వాల్సిందే. లేదంటే కోర్టు నుంచే నేరుగా తీహార్ జైలుకు పంపిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నాం`` అని న్యాయ‌మూర్తులు స్ప‌ష్టంచేశారు.

సెబీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా సేవింగ్స్ పేరుతో ప్ర‌జ‌ల నుంచి డిపాజిట్లు సేక‌రించింది స‌హారా. ఆ మొత్తాన్ని సంస్థ నుంచి వ‌సూలు చేసే ప‌నిలోసుప్రీంకోర్టు ఉంది. రూ.24 వేల కోట్ల అస‌లు మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాల‌ని కోర్టు ఆదేశించింది. ఇందులో రూ.12 వేల కోట్ల‌ను చెల్లించింది. మిగ‌తా మొత్తం చెల్లించ‌డానికి ఎన్నో డెడ్‌ లైన్లు విధించినప్ప‌టికీ స‌హారా చెల్లించలేక‌పోయింది. ఐదు వేల కోట్లు వెంట‌నే ఇవ్వాల‌ని, ఇందులో స‌గం జూన్ రెండో వారంలోగా చెల్లించాల్సిందేన‌ని తాజా ఆదేశాల్లో కోర్టు స్ప‌ష్టంచేసింది.

కాగా, డ‌బ్బు చెల్లించ‌నందుకు ప్ర‌తిగా లోనావాలాలోని స‌హారాకు చెందిన ల‌గ్జ‌రీ ఆంబీ వ్యాలీని వేలం వేయాల్సిందిగా గ‌త విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే స‌హారా త‌ర‌ఫున వాదిస్తున్న క‌పిల్ సిబ‌ల్‌.. దీనిని వ్య‌తిరేకించారు. దీనిపై పున‌రాలోచించాల‌ని ఆయ‌న కోరినా.. కోర్టు నిరాక‌రించింది. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు మీరు అని ఈ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. 2014లో స‌హారా చీఫ్ సుబ్ర‌తా రాయ్‌ను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచారు. గ‌తేడాది త‌న త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రు కావ‌డానికి ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేశారు. అప్ప‌టి నుంచి బెయిల్‌ను పొడిగిస్తూ వెళ్తున్నారు. స‌హారా ఇప్ప‌టికే త‌న విలువైన ఆస్తుల‌ను ఎన్నింటినో అమ్మ‌కానికి పెట్టింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/