Begin typing your search above and press return to search.

అను 3 గంటలు.. నిత్య 12 గంటలు

By:  Tupaki Desk   |   18 Aug 2018 10:48 AM GMT
అను 3 గంటలు.. నిత్య 12 గంటలు
X
‘గీత గోవిందం’ సినిమాలో కంటెంట్ పరంగా చాలా సర్ ప్రైజులే ఉన్నాయి. అర్జున్ రెడ్డి లాంటి అగ్రెసివ్ క్యారెక్టర్ చేసిన తర్వాత విజయ్ దేవరకొండ ఇలాంటి సాఫ్ట్ క్యారెక్టర్ చేయడమే పెద్ద సర్ప్రైజ్. ఇలాంటి విశేషాలు మరెన్నో సినిమాలో ఉన్నాయి. వీటికి తోడు ఇందులో నిత్యా మీనన్.. అను ఇమ్మాన్యుయెల్ అతిథి పాత్రల్లో మెరవడం కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చాయి. ఈ విషయం విడుదల ముందు వరకు ఎవరికీ తెలియదు. సినిమాలో వీళ్లను చూసి ప్రేక్షకులు ఒకింత షాకయ్యారు. విశేషం ఏంటంటే.. నిత్య.. అనుల పాత్రలకు సంబంధించిన సన్నివేశాల్ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేశారట. వీళ్లిద్దరూ కొన్ని గంటల వ్యవధి మాత్రమే సినిమా కోసం కేటాయించారట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు పరశురామే వెల్లడించాడు.

‘గీత గోవిందం’లో హీరో తన కథ అంతా నిత్యా మీనన్ దగ్గరే చెప్పుకుంటాడు. సినిమా మొత్తంలో మూడు సందర్భాల్లో నిత్య దర్శనమిస్తుంది. మొత్తంగా ఒక పది నిమిషాల్లోపే ఆమె కనిపిస్తుంది. ఈ మూడు సన్నివేశాల్ని రాత్రి 10 గంటలకు మొదలుపెట్టి.. మరుసటి రోజు ఉదయం 10 గంటలకే పూర్తి చేసేశాడట పరశురామ్. చిన్న పాత్ర అయినా నిత్య అడగ్గానే ఒప్పుకుందని.. ఆమె పాత్ర సినిమాకు ప్లస్ అయిందని అతనన్నాడు. ఇక అను ఇమ్మాన్యుయెల్ ఒక మూడు నిమిషాలు మాత్రమే సినిమాలో కనిపిస్తుంది. హీరో ఆమెను లైన్ లో పెట్టడానికి ప్రయత్నించే సీన్ భలే ఫన్నీగా ఉంటుంది. ఈ సన్నివేశాన్ని మూడు గంటల్లో చిత్రీకరించాడట పరశురామ్. ‘గీతా ఆర్ట్స్’ భాగస్వామ్యంలోనే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చేస్తున్న సమయంలోనే ఈ చిత్రం కోసం ఈ మూడు గంటలు కేటాయించిందట అను. ఇందుకోసం ఆమె పారితోషకం కూడా ఏమీ తీసుకోలేదని తెలుస్తోంది. నిత్యకు మాత్రం కొంత రెమ్యూనరేషన్ ఇచ్చారట.