Begin typing your search above and press return to search.

లీడ్ రోల్ చేయాల్సింది..అతిథి పాత్ర చేస్తోంది

By:  Tupaki Desk   |   22 Sep 2018 10:49 AM GMT
లీడ్ రోల్ చేయాల్సింది..అతిథి పాత్ర చేస్తోంది
X
ఈ ఏడాది వేసవిలో విడుదలై తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించింది ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేష్‌ కు ఎంత గొప్ప పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతకుముందు ఆమెను రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్‌ లాగే చూసేవాళ్లు. కానీ ఈ సినిమా తర్వాత ఆమె ఇమేజే మారిపోయింది. ఆమెను గొప్ప నటిగా గుర్తిస్తున్నారు. ఐతే నిజానికి ముందు ‘మహానటి’ కోసం అనుకున్న నటి కీర్తి కాదు. దక్షిణాదిన నటించిన ప్రతి భాషలోనూ మంచి నటిగా గుర్తింపు సంపాదించిన నిత్య మీనన్‌ ను ముందు సావిత్రి పాత్రకు అడిగారు. ఆమె కూడా ఒక దశలో ఓకే అంది. కానీ కారణాలేంటో తెలియదు కానీ.. తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఈ విషయంలో తనకు రిగ్రెట్స్ ఏమీ లేవని అంది కానీ.. ‘మహానటి’ సాధించిన విజయం - కీర్తికి వచ్చిన పేరు చూశాక నిత్యలో ఏదో ఒక మూల బాధ లేకుండా ఉండదు.

ఐతే అప్పడు ‘మహానటి’లో లీడ్ రోల్ చేసే అవకాశాన్ని వదులుకున్న నిత్య.. ఇప్పుడు సావిత్రిగా అతిథి పాత్ర చేయబోతుండటం విశేషం. మహానటుడు - మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’లో సావిత్రిగా నటించేది నిత్య మీననేనట. ఈ పాత్రను మళ్లీ కీర్తితోనే చేయించాలని అనుకున్నారు కానీ.. అలా చేస్తే ప్రేక్షకుల్లో ఈ క్యారెక్టర్ పట్ల ఎగ్జైట్మెంట్ ఏమీ ఉండదని.. అందుకే ఆర్టిస్టును మార్చాలని దర్శకుడు క్రిష్ డిసైడయ్యాడు. ఆయనకు తర్వాతి ఛాయిస్ నిత్యనే కనిపించింది. ‘మహానటి’ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా.. ఈ సినిమాలో సావిత్రిగా నటించడానికి నిత్య ఓకే అందట. తానైతే ఈ పాత్ర ఎలా చేసేదాన్నో అందరికీ చూపించాలని నిత్య భావిస్తుండొచ్చు. సావిత్రి పాత్రకు నిత్య పర్ఫెక్టుగా సూటవుతుందని భావిస్తున్నారు. ఆమె లుక్స్ సావిత్రికి దగ్గరగా ఉంటాయి. పైగా నిత్య.. సావిత్రి లాగే మంచి నటి కూడా కదా.