Begin typing your search above and press return to search.

ఇక్కడ హీరో కొట్టేస్తే.. అక్కడ డైరెక్టర్ కొట్టేశాడు

By:  Tupaki Desk   |   20 Aug 2017 5:30 PM GMT
ఇక్కడ హీరో కొట్టేస్తే.. అక్కడ డైరెక్టర్ కొట్టేశాడు
X
పోయిన వారాంతంలో ఒకే రోజు ఒకటికి మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఆ మూడూ క్రేజున్న సినిమాలే. మూడింట్లో దేనికీ కూడా నెగెటివ్ టాక్ రాకపోవడం విశేషమే. కానీ బాక్సాఫీస్ దగ్గర మూడు సినిమాలూ మూడు రకాలుగా పెర్ఫామ్ చేశాయి. తక్కువ పెట్టుబడితో తెరకెక్కడం.. బాగా ప్రమోట్ చేయడం.. ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం.. రానా క్రేజ్.. ఇలా అన్నీ కలిసొచ్చి ‘నేనే రాజు నేనే మంత్రి’కి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ సినిమా లాభాల బాట పట్టింది.

ఇక ‘జయ జానకి నాయక’ అన్నింటికంటే ఎక్కువ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. స్టార్ వాల్యూ లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ ఓ మోస్తరుగా వచ్చాయి. ఫుల్ రన్లో ఈ సినిమా సేఫ్ జోన్లోకి వస్తుందా రాదా అన్నది సందేహంగానే ఉంది. యావరేజ్ టాక్‌ తో మొదలై.. యావరేజ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘లై’ బయటపడటం అసాధ్యమని తేలిపోయింది. ఈ మూడు సినిమాల ఫలితాలకు సంబంధించి క్రెడిట్ ఎవరెవరికి వెళ్లిందన్నది కూడా ఇక్కడ ఆసక్తికరమైన విషయం.

‘నేనే రాజు నేనే మంత్రి’ సక్సెస్ అయినప్పటికీ దర్శకుడు తేజకు ఇది మంచి పేరైతే తేలేదు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా రానా పట్టుకుపోతున్నాడు. అతడి క్రేజ్ వల్ల.. సురేష్ బాబు ప్రమోషన్.. ప్లానింగ్ వల్లే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయన్నది వాస్తవం. నిజానికి ఈ సినిమాకు టాక్ ఏమంత బాగా లేదు. అందరూ రానా పెర్ఫామెన్స్ ను పొగిడాడు. తేజ డైరెక్షన్ మీద విమర్శలు గుప్పించారు. ఈ సినిమాకు వసూళ్లు రావడానికి కూడా రానానే కారణమయ్యాడు. మొత్తానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ తేజ కెరీర్ కు ఎంత మాత్రం ఉపయోగపడుతుందన్నది సందేహంగానే ఉంది.

ఇక ‘జయ జానకి నాయక’ విషయానికొస్తే.. అక్కడ పూర్తి భిన్నమైన పరిస్థితి. మామూలుగా ఇలాంటి మాస్ మసాలా సినిమాలు సక్సెస్ అయితే క్రెడిట్ ఎక్కువ భాగం హీరోకు వెళ్తుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ కు ఎవ్వరూ సక్సెస్ క్రెడిట్ ఇవ్వలేదు. అందరూ బోయపాటినే ఆకాశానికెత్తేస్తున్నారు. శ్రీనివాస్ లాంటి చిన్న హీరోను పెట్టుకుని కూడా ప్రేక్షకుల్ని మెప్పించాడంటూ బోయపాటిని పొగిడేస్తున్నారు. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం అతడికే కట్టబెట్టేస్తున్నారు.

ఇక ‘లై’ విషయానికొస్తే.. దాని ఫెయిల్యూర్ క్రెడిట్ అందరూ కలిసి మోస్తున్నారు. మంచి కథే ఎంచుకున్నప్పటికీ దాన్ని కన్ఫ్యూజింగ్ గా చెప్పినందుకు దర్శకుడు హను రాఘవపూడిని.. వైవిధ్యమైన సినిమా చేసే క్రమంలో మూలాలు మరిచిపోయాడని నితిన్ ను విమర్శిస్తున్నారు. అలాగే వీళ్లిద్దరి మార్కెట్ గురించి చూసుకోకుండా అతిగా ఖర్చు పెట్టి.. తీవ్రమైన పోటీ మధ్య సినిమాను రిలీజ్ చేసిన నిర్మాతలు అందుకు మూల్యం చెల్లించుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.