Begin typing your search above and press return to search.

కామెంట్: వెనకటికి ఓ సామెత ఉంది..

By:  Tupaki Desk   |   15 Aug 2017 8:28 AM GMT
కామెంట్: వెనకటికి ఓ సామెత ఉంది..
X
వెనకటికి ఓ సామెత ఉంది.. మంది ఎక్కువైతే మజ్జిక పల్చనవుతుందట. అది ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర స్పష్టంగా కనిపిస్తోంది కూడా. కమర్షియల్ గా ఎలా ఉన్నా హిట్టయిపోయే సినిమాలను.. చేజేతులారా సూపర్ సక్సెస్ ను దగ్గరకు రాకుండా చేసుకున్న పరిస్థితి. ఫ్లాప్ టాక్ రాకపోయినా కూడా ఫ్లాపును చవిచూడాల్సి వచ్చే సిట్యుయేషన్. వద్దన్నా వినకుండా యుద్దం అన్నారు.. కాని విన్నర్లు మాత్రం లేరు. అందరికీ దెబ్బలు తగులుతున్నాయ్. తగలబోతున్నాయ్.

మొన్న శుక్రవారం నేనే రాజు నేనే మంత్రి.. లై.. జయ జానకి నాయక సినిమాలు రిలీజయ్యాయ్. ఈ మూడింటిలో దేనికీ అబ్బో చితక్కొట్టేసింది బ్లాక్ బస్టర్ అనేంత టాక్ రాలేదు. అలాగని మూడూ కూడా ఫ్లాపు సినిమాలూ కాదు. మూడింటికీ యావరేజ్ టాక్ వచ్చింది. కాని ఆగస్టు 11నే రావాలి.. ఇండిపెండెన్స్ డే వీకెండ్ క్యాష్‌ చేసుకోవాలి.. అనే వీరి ఆశ మాత్రం అత్యాశగా మిగిలిపోనుంది. ఎందుకంటే మామూలుగా ఒకేరోజు మూడు సినిమాలొస్తే ఆటోమ్యాటిక్ గా ప్రేక్షకులు డివైడ్ అయిపోతారు. 'లై' సినిమా కాన్సెప్టు కొత్తదే.. రొటీన్ హీరోయిజం కాదు. సోలోగా రిలీజయ్యుంటే ఖచ్చితంగా కలక్షన్లు ఎక్కువొచ్చేవి. 'జయ జానకి నాయకి' మాస్ కు పిచ్చిపిచ్చిగా నచ్చింది. కాని పక్కనే పోటీగా రానా సినిమా లేకపోతే ఇంకా ఎక్కువగా కలక్షన్లు వచ్చేవి. ఇక 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా నెగెటివ్ క్లయమ్యాక్స్ తో ఒక ప్రయోగం చేశారు. అలాంటి సినిమాను సోలోగా దించుంటే.. వావ్ అనేవారు. ఇప్పుడు అందరితో కలసి రావడం వలన దెబ్బేలే తగులుతున్నాయి. కలక్షన్లు వస్తున్నాయి కదా.. దెబ్బలు ఏంటి అంటారేమో.. అక్కడికే వస్తున్నాం.

ఇప్పుడు 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మీద ఏకంగా 25 కోట్లు వరకు పెట్టారట. తక్కువ బడ్జెట్లో తీసినా కూడా ప్రమోషన్ కు బాగా పెట్టేశారు. ఎక్కువ ధియేటర్లలో రిలీజ్ కాబట్టి.. ఆ డబ్బులు పెట్టాల్సి వచ్చింది. అలాగే 'లై' సినిమాకు 35 నుండి 40 కోట్ల వరకు ఖర్చయ్యింది. 'జయ జానక నాయక' కూడా 35 కోట్ల వరకు లెక్క తేలింది. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మూడు సినిమాలూ రెవెన్యూలు పంచుకోవడం వలన.. చివర్లో ఏ సినిమాకూ బ్రేక్ ఈవెన్ వచ్చే అవకాశం పెద్దగా లేదు. ఒకవేళ రానా కాస్త ముందుగా దూసుకెళ్ళినా.. బ్రేక్ ఈవెన్ మాత్రం రావడం కష్టమే. మరి అనవసరంగా ఆగస్టు 11న ముప్పేట పోటీకి కాలు దువ్వకపోతే ఇప్పుడు చక్కగా ఈ సినిమాలన్నింటికీ కలక్షన్లు బాగానే వచ్చేవి. ఒక్కొక్కరూ ఒక్కో వారం వచ్చినా సరిపోయేది. సినిమా ఖర్చులు పెరిగిపోయిన వేళ.. సినిమాలను పోటీలో కంటే సోలోగా రిలీజ్ చేయడమే బెటర్ అని మరోసారి సురేష్‌ బాబు అండ్ దిల్ రాజు వంటి పెద్దలు ఇప్పుడు పాఠం నేర్చుకున్నట్లే అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

ఈ సినిమాల ఓవర్సీస్ కలక్షన్లను చూసుకున్నా కూడా.. దెబ్బే పడింది. అమెరికాలో మూడు సినిమాలు ఒకేసారి వస్తే ఒకదానికే వెళతారు. మిగతా రెండింటికి దెబ్బే పడుతుంది. ఎందుకంటే ఒక వీకెండ్ ఒక సినిమాకే అని ప్లాన్ చేసుకుంటారు. మూడు సినిమాలనూ చూడలేరు. ధియేటర్ దూరం కావచ్చు.. టైమ్ సరిపడకపోవచ్చు. అందుకే ఒక్కో వారం ఒక్కోసినిమా అయితే.. రివ్యూలూ రేటింగులూ ఎలా ఉన్నా కొందరు సినిమా మీద అభిమానంతో ఖచ్చితంగా ధియేటర్లకు వచ్చేవారు. మంది ఎక్కువైతే మజ్జిక పల్చనవుతుంది లేదంటే పూర్తిగా నీళ్ళలా కూడా అనిపిస్తుంది. సామెత కరక్టే!!