Begin typing your search above and press return to search.

చిరు.. మ‌హేష్ తో మైత్రి సంస్థ‌ ప్లానింగ్

By:  Tupaki Desk   |   12 July 2019 1:30 AM GMT
చిరు.. మ‌హేష్ తో మైత్రి సంస్థ‌ ప్లానింగ్
X
మైత్రి మూవీ మేక‌ర్స్ లైన‌ప్ చూస్తుంటే మ‌రో ఐదేళ్ల పాటు కాల్షీట్లు ఖాళీ లేవ‌నే అర్థ‌మ‌వుతోంది. వ‌రుస‌గా అగ్ర హీరోల‌తో సినిమాలు నిర్మిస్తూనే మిడ్ రేంజు హీరోల‌తోనూ మైత్రి సంస్థ భారీ ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తోంది. క‌థ‌లు కుద‌రాలే కానీ ఎవ‌రినీ వ‌దిలేట్టు లేదు ఈ సంస్థ‌. ఇండ‌స్ట్రీ అగ్ర నిర్మాణ సంస్థ‌లతో పోటీప‌డుతూ వ‌రుస‌గా సినిమాలు తీసేందుకు మైత్రి సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇంత‌కీ మైత్రి సంస్థ మైండ్ లో ఉన్న హీరోలు ఎవ‌రెవ‌రు? అన్న‌ది ప‌రిశీలిస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే.

మెగాస్టార్ చిరంజీవి.. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌.. యంగ్ య‌మ ఎన్టీఆర్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్.. వీళ్లంద‌రితోనూ వ‌రుస‌గా సినిమాలు తీసేందుకు మైత్రి సంస్థ యాక్ష‌న్ ప్లాన్ రెడీగా ఉంది. ఓ వైపు క‌థ‌లు వండిస్తూనే వీళ్ల కాల్షీట్ల‌ను లాక్ చేసేందుకు స‌ద‌రు సంస్థ ప్లానింగ్ లో ఉంది. మైత్రి అధినేత‌ల్లో ఒక‌రైన న‌వీన్ మాట్లాడుతూ.. ``మెగాస్టార్ చిరంజీవి గారితో ఓ సినిమా చేయాల‌న్న‌ది మా డ్రీమ్. దానికోసం ప్రాసెస్ లో ఉన్నాం. క‌థ రెడీ అవుతోంది. మెగాస్టార్ కి క‌థ న‌చ్చి ఓకే అంటే వెంట‌నే చేసేస్తాం. ఆయ‌న వ‌ద్ద‌కు క‌థ తీసుకెళ్లాలి. మెప్పించాలి. ఈ విష‌యంలో మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ప్ర‌స్తుతానికి ప్రాసెస్ లో ఉన్నాం. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఫలానా ద‌ర్శ‌కుడు అని ఫిక్స్ కాలేదు`` అని తెలిపారు. అలాగే `శ్రీ‌మంతుడు` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ తోనూ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నామ‌ని మైత్రి అధినేత వెల్ల‌డించారు. 2020లో మ‌హేష్ తో సినిమా ఉంటుంద‌ని న‌వీన్ ఎర్నేని తెలిపారు.

మీ ఆస్థాన ద‌ర్శ‌కుడు కొర‌టాల‌తోనే చిరంజీవి మూవీ ప్లాన్ చేస్తారా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా న‌వీన్ స్పందించారు. ``కొరటాల ఇప్ప‌టికే చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారు. త్రివిక్ర‌మ్ గారు దాన‌య్య‌తో సినిమా చేస్తున్నామ‌ని అన్నారు. కాబ‌ట్టి ప్ర‌స్తుతానికి మెగాస్టార్ కి ఏ డైరెక్టర్ ని అనుకోలేదు. క‌థ‌ను మాత్రం రెడీ చేయిస్తున్నాం`` అని తెలిపారు. ఇక మాట‌ల మాయావితో సినిమా గురించి మాట్లాడుతూ.. త్రివిక్ర‌మ్ తో 2012లోనే చేయాల‌నుకుంటే డిలే అయ్యింది.. ఆయ‌న‌తో చేస్తున్నాం అని అన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్ లో మైత్రి మూవీ మేక‌ర్స్ సినిమా ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్- కేజీఎఫ్ డైరెక్ట‌ర్ సినిమాని మైత్రి అధినేత‌ న‌వీన్ క‌న్ఫామ్ చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ త‌నూ `డియ‌ర్ కామ్రేడ్` (ఈనెల 26న రిలీజ్) త‌ర్వాత `హీరో` చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి సంస్థ అటుపైనా వ‌రుస‌గా సినిమాలు చేస్తుంద‌ని న‌వీన్ వెల్ల‌డించారు.