Begin typing your search above and press return to search.

రేయ్ ఫృథ్వీ.. నాగబాబు వార్నింగ్

By:  Tupaki Desk   |   18 Feb 2019 9:46 AM GMT
రేయ్ ఫృథ్వీ.. నాగబాబు వార్నింగ్
X
30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఫేమస్ అయిన కమెడియన్ ఫృథ్వీపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. ‘రేయ్ ఫృథ్వీ.. నువ్వు నాకు ఫోన్ చేయ్’ అంటూ వేలు చూపించి మరీ ఓ టీవీ ఇంటర్వ్యూలో వార్నింగ్ ఇవ్వడం సంచలనమైంది. ఫృథ్వీపై నాగబాబు ఇంతలా రియాక్ట్ కావడానికి బలమైన కారణమే ఉంది.

ఇటీవలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జనసేన పార్టీని ఆదుకునేందుకు మెగా బ్రదర్ నాగబాబు.. ఆయన కుమారుడు వరుణ్ తేజ్ లు ఇద్దరూ కలిసి తమ వంతుగా కోటి 25 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ విరాళంపై కమెడియన్ ఫృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఓ ఇంటర్వ్యూలో నాగబాబు దృష్టికి సదురు యాంకర్ తీసుకెళ్లారు.. ఈ మధ్యే వైసీపీలో చేరి నాయకుడిగా చెలామణీ అవుతున్న ఫృథ్వీ నాగబాబును ఉద్దేశించి ఈ కామెంట్ చేసినట్టు చెప్పారు.

‘ఎక్కడ నుంచో తీసుకొచ్చిన డబ్బుని తన కొడుకు ఖాతాలో వేసి దాన్ని జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చారంటూ’ ఫృథ్వీ కామెంట్ చేసినట్టు యాంకర్ నాగబాబుకు చెప్పాడు..

ఈ విషయంపై నాగబాబు ఘాటుగా స్పందించారు. ఫృథ్వీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ‘ఫండ్ గురించి ఫృథ్వీ కామెంట్ చేశాడా?.. రేయ్ ఫృథ్వీ.. రేపు నువ్వు నాకు ఫోన్ చేయరా.. ఈ ప్రశ్నకి నేను నీకే సమాధానం ఇస్తాను.. ఫృథ్వీ నీకే చెబుతున్నా.. రేప్పొద్దున ఫోన్ చెయ్.. నా నెంబర్ నీ దగ్గర ఉంది’’ అంటూ నాగబాబు వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఫృథ్వీ కామెంట్ చేశాడని కాదని.. దీనికి మాకు సమాధానం చెప్పాలని యాంకర్ .. నాగబాబును ప్రశ్నించారు. దీనికి మెగా బ్రదర్ స్పందించారు.. ‘ఎవరికో ఫ్రూవ్ చేయాల్సిన అవసరం తనకు లేదని.. నాగబాబు అకౌంట్ నుంచి పాతిక లక్షలు.. కొడుకు వరుణ్ ఖాతా నుంచి కోటి తీసి ఇచ్చాం. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ చెప్పారు. అది బ్లాక్ మనీ కాదని.. తాము ఐటీకి ఆ డబ్బులు చూపించామని.. అకౌంటెడ్ క్యాష్ అని.. అది పన్ను చెల్లించినదే అని నాగబాబు స్పష్టం చేశారు.