Begin typing your search above and press return to search.

నాగశౌర్య.. మనసు దోచాడు

By:  Tupaki Desk   |   10 Oct 2015 9:30 AM GMT
నాగశౌర్య.. మనసు దోచాడు
X
ఊహలు గుసగుసలాడే - దిక్కులు చూడకు రామయ్యా లాంటి సినిమాలతో యూత్ ఆడియన్స్ కి చేరువైన కథానాయకుడు నాగశౌర్య. ఈ యువ కథానాయకుడు ఓ మంచి పనితో అందరి దృష్టిలో పడ్డాడు. ఇటీవలే కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ప్రాణాలు వదిలిన సత్యం అనే సైనికుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చాడు. విజయనగరం జిల్లా బొబ్బిలికి వెళ్లి సత్యం కుటుంబాన్ని పరామర్శించిన శౌర్య.. వారికి తన వంతుగా 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాడు.

సత్యం భార్య - పిల్లల్ని పరామర్శించిన నాగశౌర్య.. తర్వాత కూడా ఏదైనా సాయం అవసరమైతే తనను అడగాలని, తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చాడు. పత్రికల్లో సత్యం గురించి వార్త చదివి.. పనిగట్టుకుని విజయనగరం జిల్లాకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి మరీ డబ్బులివ్వడం ద్వారా నాగశౌర్య తన పెద్ద మనసును చాటుకున్నాడు. తన తండ్రి శంకర్ ప్రసాద్ స్ఫూర్తితో తానీ సాయం చేసినట్లు శౌర్య వెల్లడించాడు.

నాగశౌర్య చివరి సినిమా ‘జాదూగాడు’ ఫ్లాప్ అయింది. ఇప్పుడతని ఆశలన్నీ నందినరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కళ్యాణ వైభోగమే’ మీదే ఉన్నాయి. ఆ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. దీంతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో ‘అమ్మాయితో అబ్బాయి’ షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు మధుర శ్రీధర్ రెడ్డి-టీవీ9 నిర్మాణంలో ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’ ఫేమ్ రామరాజు దర్శకత్వం వహించే సినిమాను కూడా ఒప్పుకున్నాడు శౌర్య. ఇందులో నాగబాబు తనయురాలు నీహారిక కథానాయికగా నటించబోతుండటం విశేషం.