Begin typing your search above and press return to search.

‘మహానటి’ ప్రయాణం మొదలైంది

By:  Tupaki Desk   |   29 May 2017 9:40 AM GMT
‘మహానటి’ ప్రయాణం మొదలైంది
X
తెలుగులో మరో ప్రతిష్టాత్మక సినిమాకు రంగం సిద్ధమైంది. మహా నటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కనున్న ‘మహానటి’ ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లింది. దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం సన్నాహాల్లో ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్.. ఎట్టకేలకు షూటింగ్ ఆరంభించాడు. సోమవారం హైదరాబాద్ లోని రామకృష్ణ స్టూడియోలో ‘మహానటి’ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

‘ఎవడే సుబ్రమణ్యం’తో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. తన రెండో సినిమాగా సావిత్రి జీవిత కథను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతను చాలా పరిశోధనే చేశాడు. ఎంతో చదివాడు. ఎందరినో కలిశాడు. చివరికి స్క్రిప్టు పక్కాగా రెడీ అయ్యాక షూటింగ్ మొదలుపెట్టాడు. షూటింగ్ నిర్విరామంగా జరుగుతుందని.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని చిత్ర బృందం చెబుతోంది.

కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించబోయే ఈ సినిమాలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. జెమిని గణేశన్ పాత్రలో కనిపిస్తాడట. ఐతే ఇంకా ఎన్టీఆర్.. ఏఎన్నార్ పాత్రల్లో ఎవరు కనిపిస్తారన్న సస్పెన్సుకు తెర పడలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సతీమణి.. అశ్వనీదత్ కూతురైన ప్రియాంక దత్ నిర్మించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/