Begin typing your search above and press return to search.

నాగార్జున‌ని ప‌రామ‌ర్శించిన ఎన్టీఆర్‌

By:  Tupaki Desk   |   30 July 2016 8:19 AM GMT
నాగార్జున‌ని ప‌రామ‌ర్శించిన ఎన్టీఆర్‌
X
అభిమాని పిలిస్తే ప‌లికేంత దూరంలో ఉండే క‌థానాయ‌కుడు ఎన్టీఆర్‌. పబ్లిక్ మీటింగ్‌ ల‌లోనైనా, త‌న ఆడియో ఫంక్ష‌న్ ల‌లోనైనా అభిమాని గురించి ప్ర‌స్తావించ‌కుండా మాత్రం కింద‌కి దిగ‌డు. త‌న అభిమానులంటే ఆయ‌న‌కి అంతిష్టం. క‌ష్టాల్లో ఉన్న‌ట్టు తెలిస్తే చాలు.. సాధ్య‌మైనంత‌వ‌ర‌కు వాళ్ల‌ను ఆదుకోవ‌డానికే ప్ర‌య‌త్నిస్తుంటాడు. తాజాగా ఓ వీరాభిమాని కోసం ఎన్టీఆర్ బెంగుళూరు వెళ్లాడు. అక్క‌డ క్యాన్స‌ర్‌ తో చివ‌రి రోజుల్ని గ‌డుపుతున్న ఆ అభిమానిని త‌న గుండెల‌కి హ‌త్తుకొని ప‌రామ‌ర్శించాడు. కుటుంబ స‌భ్యుల‌కి ధైర్యం చెప్పాడు. ఆ వివ‌రాల్లోకి వెళితే.. బెంగుళూరికి చెందిన నాగార్జున అనే వ్య‌క్తి ఎన్టీఆర్‌ కి వీరాభిమాని.

అయితే కొంత‌కాలం క్రిత‌మే నాగార్జున క్యాన్స‌ర్‌ తో మంచం ప‌ట్టాడు. ఇటీవ‌ల ఆ జ‌బ్బు మ‌రింత ముదిరింది. దీంతో త‌న చివ‌రి కోరిక‌గా ఎన్టీఆర్‌ ని చూడాల‌నుకొన్నాడు నాగార్జున‌. ఆ విష‌యం తెలిసినవెంట‌నే ఎన్టీఆర్ బెంగుళూరు వెళ్లిపోయాడు. త‌న అభిమాని చివ‌రి కోరిక‌ని తీర్చాడు. చాలాసేపు ఆయ‌న‌తో ముచ్చ‌ట్లు చెప్పి న‌వ్వించాడు. కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి వాళ్ల‌కి ధైర్యం చెప్పాడు. ఎన్టీఆర్ మంచి మ‌న‌సును చూసి అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఇదివ‌ర‌కు హైద‌రాబాద్‌ లో కూడా ఇలా క్యాన్స‌ర్‌ తో బాధ‌ప‌డుతున్న కొద్దిమంది అభిమానుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ ప‌రామ‌ర్శించి వ‌చ్చాడు.