Begin typing your search above and press return to search.

‘అర్జున్ రెడ్డి’ని చూసి ‘జై లవకుశ’ ధైర్యం

By:  Tupaki Desk   |   13 Sep 2017 6:20 AM GMT
‘అర్జున్ రెడ్డి’ని చూసి ‘జై లవకుశ’ ధైర్యం
X
ఒకప్పుడు తెలుగు సినిమాలు మినిమం రెండున్నర గంటలుండేవి. కానీ మధ్యలో నిడివి తగ్గుతూ వచ్చింది. గత కొన్నేళ్లలో చాలా వరకు సినిమాలు రెండు.. రెండుంబావు గంటల మధ్యే ఉంటున్నాయి. ఐతే ఈ మధ్య దర్శక నిర్మాతలు నిడివి విషయంలో ఫ్రీ హ్యాండ్ తీసుకుంటున్నారు. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వచ్చిన మూడు సినిమాల నిడివి కూడా రెండున్నర గంటలకు అటు ఇటుగానే ఉంది. ‘అర్జున్ రెడ్డి’ లెంత్ అయితే ఏకంగా మూడు గంటలు దాటిపోయింది. అయినా ఆ సినిమాకు అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. ఇది చూసే ‘జై లవకుశ’ టీం ధైర్యంగా తమ సినిమా నిడివిని కొంచెం ఎక్కువే ఉంచేసినట్లు సమాచారం.

‘జై లవకుశ’ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర నిడివి 2 గంటల 35 నిమిషాలు ఉంటుందట. నిజానికి లెంగ్త్ ఇంకా పెరిగినప్పటికీ ఫైనల్ ఎడిటింగ్ తర్వాత ఆ మాత్రం వచ్చినట్లు తెలిసింది. ఎన్టీఆర్ ఇందులో మూడు పాత్రలు పోషించిన నేపథ్యంలో వాటి ఎస్టాబ్లిష్ మెంట్ తోనే సినిమాలో సగం నిడివి అయిపోతుందట. మిగతా సగం కథను నడిపిస్తారు. ‘జై లవకుశ’ ఫస్ట్ కాపీ ఇప్పటికే రెడీ అయిపోయింది. విడుదలకు వారం ముందుగా.. అంటే ఈ గురువారమే సెన్సార్ తంతు ముగించేస్తున్నారు. ‘యు/ఎ’ సర్టిఫికెట్ వస్తుందని భావిస్తున్నారు. సెప్టెంబరు 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.