Begin typing your search above and press return to search.

విషాదం: ఆ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూశాడు

By:  Tupaki Desk   |   5 Sep 2015 6:27 AM GMT
విషాదం: ఆ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూశాడు
X
ఎ.ఆర్.రెహమాన్ తన తోటి సంగీత దర్శకుడి దయనీయమైన స్థితి గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలా ఓ సందేశం పెట్టాడో లేదో.. మరో రెండు రోజులకే ఆ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూశాడు. బాలీవుడ్ లో రెండు దశాబ్దాలుగా అనేక సినిమాలకు పని చేసిన సీనియర్ సంగీత దర్శకుడు ఆదేశ్ శ్రీవాస్తవ క్యాన్సర్ తో పోరాడి ఓడిపోయాడు. గత అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆదేశ్ తుది శ్వాస విడిచాడు. ఆదేశ్ కు ఐదేళ్ల క్రితమే క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. ఐతే చికిత్స తీసుకున్నాక కోలుకున్నాడు. కొన్ని సినిమాలకు కూడా పని చేశాడు. ఐతే మళ్లీ ఆ మహమ్మారి తిరగబెట్టడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గత 42 రోజులుగా ఆదేశ్ ముంబయిలోని కోకిలా బెన్ ధీరూబాయి అంబాని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

గతం వారం రోజులుగా శ్రీవాస్తవ పరిస్థితి విషమంగా ఉంది. ఐతే ఈ సంగతి చాలామందికి తెలియదు. ఐతే రెహమాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడంతో శ్రీవాస్తవ పరిస్థితి అందరికీ బోధపడింది. ఇంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. ఆదేశ్ 49వ పుట్టిన రోజుకు మరుసటి రోజే అతను ప్రాణాలు విడవడం పెద్ద విషాదం. తొలిసారి క్యాన్సర్ గురించి తెలిశాక ఆదేశ్ తన జీవనశైలిని ఎంతో మార్చుకున్నాడు. మద్యం, ధూమపానం వదిలేశాడు. యోగా ప్రాక్టీక్ చేశాడు. చికిత్స తర్వాత కోలుకున్నట్లే కనిపించాడు.. మళ్లీ అతణ్ని క్యాన్సర్ పట్టుకుంది. ఓ దశలో అతను చికిత్సకు డబ్బుల్లేక తన ఆస్తుల్ని కూడా అమ్ముకున్నట్లు సమాచారం. చల్తే చల్తే, భాగ్ బన్, కభీ ఖుషీ కభీ గమ్, రాజ్ నీతి లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఆదేశ్ సంగీతాన్నందించాడు.