Begin typing your search above and press return to search.

వజ్రోత్సవాల కన్నా మిన్నగా ‘ఎంబీ40’

By:  Tupaki Desk   |   31 Aug 2016 11:30 AM GMT
వజ్రోత్సవాల కన్నా మిన్నగా ‘ఎంబీ40’
X
తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించిన వేడుక ఏదంటే 2006 నాటి వజ్రోత్సవాల గురించే చెప్పుకుంటాం. ఐతే ఇప్పుడు దాన్ని మించే వేడుక రాబోతోందట. మోహన్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబరు 17న విశాఖపట్నంలో భారీ వేడుక చేయడానికి ఆయన కుటుంబం.. అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుక వజ్రోత్సవాల కన్నా మిన్నగా ఉంటుందని.. తెలుగు సినిమా చరిత్రలోనే ఇంత పెద్ద వేడుక మరొకటి చూసి ఉండరు అని ప్రెస్ నోట్ ఇవ్వడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్ సహా టాలీవుడ్ ప్రముఖ హీరోలందరూ ఈ వేడుకకు హాజరవుతారని.. ఈ వేడుకకు గ్లామర్ టచ్ కూడా బాగానే ఉంటుందని ఈ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. సౌత్ ఇండియా అంతటా ఈ ఫంక్షన్ చర్చనీయాంశమవుతుందని.. వేరే భాషలకు చెందిన పెద్ద హీరోలు కూడా చాలామంది ఈ వేడుకకు రాబోతున్నారని చెబుతున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీ కొన్ని నెలల నుంచే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. కొన్ని రోజులుగా విశాఖలోనే తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న మంచు మనోజ్ ఆ ఏర్పాట్లను చూశాను. మంచు విష్ణు కూడా ఈ మధ్యే వైజాగ్ వెళ్లి ఏర్పాట్లు చూసి వచ్చాడు. గత ఏడాది నవంబరు 22 నాటికి మోహన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయింది. అప్పట్నుంచి ఏడాది పాటు రకరకాల కార్యక్రమాలు ప్లాన్ చేసింది మంచు ఫ్యామిలీ. అందులో భాగంగానే విశాఖలో ఈ భారీ వేడుక చేస్తున్నారు.