Begin typing your search above and press return to search.

నాగ్ తర్వాత మహేష్ ను లైన్లో పెట్టాడు

By:  Tupaki Desk   |   26 Sep 2016 11:31 AM GMT
నాగ్ తర్వాత మహేష్ ను లైన్లో పెట్టాడు
X
నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా సినిమా వచ్చిన రెండేళ్లు దాటిపోయింది. అసలే కెరీర్ అంతంత మాత్రంగా సాగుతుంటే.. మరీ గ్యాప్ తీసుకునేసరికి సుమంత్ అనే హీరో ఉన్నాడన్న సంగతే జనాలు మరిచిపోయారు. ఐతే ఈసారి తన ఉనికిని గట్టిగానే చాటుకోవాలన్న ఉద్దేశంతో బాగా గ్యాప్ తీసుకుని బాలీవుడ్ హిట్ మూవీ ‘విక్కీ డోనర్’ రీమేక్‌లో నటించాడు సుమంత్. ఈ చిత్రానికి నిర్మాత కూడా అతనే. మల్లిక్ రామ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమా గురించి మొన్నటిదాకా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఐతే ఈ సినిమాకు ‘నరుడా డోనరుడా’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టడంతో పాటు.. ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి జనాలు తన సినిమా గురించి చర్చించుకునేలా చేశాడు సుమంత్. ఫస్ట్ పోస్టర్ల తర్వాత ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడిక ట్రైలర్‌తో కొట్టబోతున్నాడు సుమంత్.

‘నరుడా డోనరుడా’ ఫస్ట్ పోస్టర్లు నాగార్జున లాంచ్ చేస్తే.. ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయబోతుండటం విశేషం. మామూలుగా మహేష్.. తన బావ సుధీర్ సినిమాలకు సపోర్టిస్తుంటాడు. బయటి హీరోల సినిమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం అరుదు. ఐతే సుమంత్ ఎలాగో మహేష్‌ను ఒప్పించాడు. మరి ఫస్ట్ పోస్టర్ల లాగే ట్రైలర్ కూడా హాట్ టాపిక్ అవుతుందేమో చూడాలి. ‘నరుడా డోనరుడా’ నవంబర్లో ప్రేక్షకుల ముందుకొస్తుంది.