Begin typing your search above and press return to search.

నాకా.. మోడీ లేఖా అన్న మహేష్

By:  Tupaki Desk   |   24 Sep 2017 9:04 AM GMT
నాకా.. మోడీ లేఖా అన్న మహేష్
X
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దక్షిణాదిన అనేకమంది సెలబ్రెటీలకు స్వచ్ఛ భారత్ విషయంలో లేఖలు రాయడం గురించి వారం రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నట్లు చెప్పారు. రజినీకాంత్ ఇప్పటికే మోడీ తనకు లేఖ రాసిన మాట వాస్తవమే అని చెబుతూ.. బదులు కూడా ఇచ్చారు.

ఇక మహేష్ బాబు ఈ విషయంలో ఏమంటాడా అని చూస్తే.. అసలు తనకు మోడీ నుంచి లేఖే రాలేదంటూ షాకిచ్చాడతను. ‘స్పైడర్’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన మహేష్ బాబు వద్ద మోడీ లేఖ గురించి ప్రస్తావిస్తే.. ‘‘లేదు. నాకు అలాంటి లేఖ ఏమీ రాలేదు. అది కేవలం రూమర్ మాత్రమే’’ అని తేల్చేశాడు. మరి మహేష్ కు లేఖ అందకుండా అతడి పేరు ఎలా తెరమీదకు వచ్చిందో మరి.

ఇక రాజకీయాల ప్రస్తావన తేగానే మరోసారి నమస్కారం పెట్టేశాడు మహేష్. ‘‘రాజకీయాలు నాకు పడవు. బయట ఏం జరుగుతోందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తా కానీ.. రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా దృష్టి పూర్తిగా సినిమాల మీదే ఉంటుంది’’ అని మహేష్ స్పష్టం చేశాడు. తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం.. సిద్ధాపురం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని.. నమ్రత ఆ వ్యవహారాలు చూసుకుంటోందని.. అవసరమైతే తాను కూడా గ్రామాల్ని సందర్శిస్తానని మహేష్ తెలిపాడు. ఈ గ్రామాల్ని మంచి స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఉన్నట్లు మహేష్ చెప్పాడు.