Begin typing your search above and press return to search.

నా పారితోషకం నాకొస్తే సరిపోదు-కొరటాల

By:  Tupaki Desk   |   15 April 2018 2:30 PM GMT
నా పారితోషకం నాకొస్తే సరిపోదు-కొరటాల
X
సినిమా బిజినెస్.. కలెక్షన్లు అన్నవి నిర్మాతల వ్యవహారం.. దర్శకుడికి వాటితో సంబంధం లేదని అంటే తాను ఒప్పుకోనని అంటున్నాడు అగ్ర దర్శకుడు కొరటాల శివ. తన సినిమాల వసూళ్ల గురించి పూర్తి వివరాలు తాను తెలుసుకుంటానని అతనన్నాడు. ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాలతోనూ ఆయా హీరోలకు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లిచ్చిన ఘనత కొరటాల సొంతం. అతడి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పుతుందన్న అంచనాలున్నాయి. మరి మీరు 100 కోట్లు.. 150 కోట్ల క్లబ్బుల గురించి పట్టించుకుంటారా.. వసూళ్ల లెక్కలు తెలుసుకుంటారా అని అడిగితే కొరటాల ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

‘‘కలెక్షన్లనేవి సినిమాలో భాగం. ఎంత పెట్టాం. ఎంత తిరిగొస్తుంది అన్నది తెలియాలి. నిర్మాత 50 కోట్లు పెట్టి సినిమా తీస్తే అది 60 కోట్లకు అమ్ముడైతే చాలా సంతోషం. ఐతే నిర్మాత గురించి ఆలోచించి మిగతా వాళ్ల గురించి పట్టించుకోకుండా ఉండలేం. నిర్మాత తర్వాత సినిమాను కొన్న బయ్యర్ కు మిగిలిందా లేదా అనే టెన్షన్ మొదలవుతుంది. వాళ్లు కూడా సేఫ్ అయితే ఇంకా హ్యాపీ. ఆ తర్వాత ఎగ్జిబిటర్ల గురించి ఆలోచిస్తాం. సినిమా చివరగా ఎవరి దగ్గరికి చేరిందో వాళ్లు కూడా సేఫ్ అయితే అప్పుడే నేను హాలిడే మూడ్ లోకి వెళ్తాను. దర్శకుడిగా కలెక్షన్లను ఫాలో కావడం నా బాధ్యత. పెట్టిందానికి లాభం వచ్చిందా లేదా అని తెలుసుకోకపోవడం నా దృష్టిలో నేరం. మన ఇంట్లో అన్నింటికీ లెక్కలేసుకుంటాం. సినిమా కూడా అంతే. నా రెమ్యూనరేషన్ నాకొచ్చేసింది కదా.. మిగతా వాళ్ల సంగతి నాకెందుకు అన్నట్లు ఉండలేను’’ అని కొరటాల తెలిపాడు.