Begin typing your search above and press return to search.

13 ఏళ్ల తర్వాత కోన వారిద్దరిని కలిపాడు

By:  Tupaki Desk   |   8 Nov 2018 3:30 PM GMT
13 ఏళ్ల తర్వాత కోన వారిద్దరిని కలిపాడు
X
టాలీవుడ్‌ ప్రముఖ రచయిత కోన వెంకట్‌ ఈమద్య కాస్త సక్సెస్‌ ల విషయంలో వెనుకపడి పోయాడు. ఈయన అందించిన కథలు పాత చింతకాయ పచ్చడిలా ఉంటున్నాయని - డైలాగ్స్‌ కూడా ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉండటం లేదు అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. దాంతో రచయితగా కాస్త తగ్గించి - ప్రొడక్షన్‌ పనులు మొదలు పెట్టాడు. కోన ఫిలిం కార్పోరేషన్‌ పేరుతో పలు చిత్రాలను నిర్మించిన ఈయన ప్రస్తుతం నాగచైతన్య - సమంతలు నటిస్తున్న సినిమాకు కూడా నిర్మాతగానో సమర్పకుడిగానో వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది.

చిన్న దర్శకుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న కోన వెంకట్‌ త్వరలో మరో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఆ చిత్రంలో అనుష్క మరియు మాధవన్‌ కలిసి నటించబోతున్నారు. అనుష్క కెరీర్‌ ఆరంభంలో అంటే దాదాపు 13 ఏళ్ల క్రితం మాధవన్‌ తో కలిసి ‘రెండు’ అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పటి వరకు మాధవన్‌ - అనుష్కలు కలిసి నటించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు కోనా వారిద్దరిని కలిపాడు. విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రాన్ని హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కించబోతున్నాడట.

హేమంత్‌ మధుకర్‌ ఎనిమిది సంవత్సరాల క్రితం మంచు హీరో విష్ణుతో ‘వస్తాడు నా రాజు’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో హేమంత్‌ ఆఫ్‌ ది స్క్రీన్‌ వెళ్లి పోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు కోన సహకారంతో అనుష్క - మాధవన్‌ లతో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని ఫీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో నిర్మించబోతున్నారు. కోన వెంకట్‌ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడట. అనుష్క బర్త్‌ డే సందర్బంగా కోన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రం మెజార్టీ షూటింగ్‌ అమెరికాలో జరుపబోతున్నారట. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లి, అదే వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.