Begin typing your search above and press return to search.

క్రిష్ అడిగి లేదనిపించుకున్నాడా?

By:  Tupaki Desk   |   17 Oct 2018 3:30 PM GMT
క్రిష్ అడిగి లేదనిపించుకున్నాడా?
X
‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ ఎంత పేరు సంపాదించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏ కథానాయికకైనా ఇది లైఫ్ టైం క్యారెక్టరే. ఇలాంటి ఒక పాత్ర చేస్తే కెరీర్ తర్వాత ఏమైనా పర్వాలేదనే ఫీలింగ్ కలుగుతుంది ఏ అమ్మాయికైనా. ఈ సినిమా విడుదలయ్యాక కీర్తి పై ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయింది. ‘మహానటి’ సినిమా మీద గౌరవంతో.. అది తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఆమె కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుందట. కెరీర్లో ఇంకో బయోపిక్ ఏదీ చేయకూడదని కీర్తి నిర్ణయించుకుందట. జయలలిత బయోపిక్ కోసం అడిగినా తాను నో చెప్పానని ఆమె స్పష్టం చేసింది. అలాగే ‘యన్.టి.ఆర్’ సినిమాలో సావిత్రి పాత్రను చేయమని కూడా తనను అడిగారని.. కానీ తాను కుదరదని వినమ్రంగా చెప్పేశానని కీర్తి చెప్పింది.

దీనికి కారణం వెల్లడిస్తూ.. ‘‘మహానటి ఒక మ్యాజిక్. అది పునరావృతం అవుతుందో లేదో తెలియదు. నేనే ఇంకోసారి సావిత్రి గారి పాత్ర చేస్తే అంత బాగా వస్తుందో లేదో నాకే తెలియదు. అందుకే ఆ పాత్రను మళ్లీ టచ్ చేయకూడదని అనిపించింది. మహానటి ఒక అందమైన కిరీటం.. దాన్ని అలా చూస్తుండాలి తప్ప తాకకూడదు. అందుకే ‘యన్.టి.ఆర్’ కోసం అడిగితే ఒప్పుకోలేదు. సావిత్రి పాత్ర అనే కాదు.. ఇకపై మరే బయోపిక్ కూడా చేయొద్దని నిర్ణయించుకున్నా’’ అని కీర్తి చెప్పింది. కాబట్టి క్రిష్ అండ్ టీం సావిత్రి పాత్ర కోసం కీర్తిని అడిగి లేదనిపించుకున్నారని తేలిపోయింది. మరి ఈ చిత్రంలో సావిత్రి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారన్నది ఆసక్తికరం. ‘మహానటి’ని మిస్సయిన నిత్యా మీననే ఇందులో సావిత్రిగా నటిస్తున్నట్లు ఈ మధ్య వార్తలొచ్చాయి. కానీ ఆ విషయమై ఇంకా కన్ఫమేషన్ రాలేదు.