Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం జంట.. ఈసారి ఏం చేస్తుందో

By:  Tupaki Desk   |   17 Oct 2017 6:54 AM GMT
బ్రహ్మోత్సవం జంట.. ఈసారి ఏం చేస్తుందో
X
కాజల్ అగర్వాల్-సమంత.. ఈ జోడీ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఒక రకమైన గగుర్పాటు కలుగుతుంది. ఈ స్టార్ హీరోయిన్లిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా ‘బృందావనం’ ఓ మోస్తరుగా ఆడినా.. దాని తాలూకు గురుతుల్ని ‘బ్రహ్మోత్సవం’ చెరిపేసింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గత కొన్నేళ్లలో ఏ సినిమాకూ ఎదురు కాని ఇబ్బందికర అనుభవం ఈ చిత్ర నటీనటులకు ఎదురైంది. ఈ సినిమాకు సంబంధించిన ఏ కాంబినేషన్ రిపీటైనా ప్రేక్షకులకు ‘బ్రహ్మోత్సవం’ చేదు అనుభవాలే కళ్లముందు మెదులుతున్నాయి. తెలుగులో ఈ సినిమా కాంబినేషన్లేవీ రిపీట్ కాలేదు కానీ.. తమిళంలో ఓ మెగా సినిమాలో ‘బ్రహ్మోత్సవం’ జంటను చూడబోతున్నాం. అదే.. మెర్శల్.

విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మెర్శల్’లో కాజల్ అగర్వాల్.. సమంత హీరోయిన్లుగా నటించడం విశేషం. ఈ చిత్రంలో నిత్యా మీనన్ కూడా ఒక కథానాయికగా చేయడం విశేషం. ఆమె పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎపిసోడ్లో నిత్య మీనన్ సంప్రదాయ బద్ధంగా కనిపించనుంది. కాజల్.. సమంత గ్లామర్ విందు చేసే బాధ్యత తీసుకున్నారు. ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లన్నమాట. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రోమోలన్నింటిలోనూ విజయే హైలైట్ అయ్యాడు. సినిమాలో అతడి వన్ మ్యాన్ షోలా కనిపిస్తోంది. హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్లు లేదు. ఈ చిత్ర ప్రమోషన్లలోనూ హీరోయిన్లు కనిపించలేదు. ఈ సినిమా ‘అదిరింది’ పేరుతో తెలుగులోనూ బుధవారమే విడుదలవుతోంది. మరి కాజల్-సమంత జోడీ ‘బ్రహ్మోత్సవం’ చేదు జ్నాపకాల్ని చెరిపేసి.. మళ్లీ తమది హిట్ కాంబో అని రుజువు చేస్తుందేమో చూద్దాం.