Begin typing your search above and press return to search.

సంచలన విషయం వెల్లడించిన తమిళ నిర్మాత

By:  Tupaki Desk   |   27 July 2017 1:44 PM GMT
సంచలన విషయం వెల్లడించిన తమిళ నిర్మాత
X
జీఎస్టీ మీద తమిళ చిత్ర పరిశ్రమ ఎంతగా భగ్గుమంటోందో తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా సమ్మెలు చేశారు.. ధర్నాలు చేశారు.. ఇంకా అనేక రకాలుగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. మొన్నటిదాకా పైసా పన్ను కట్టకుండా సినిమాలు రిలీజ్ చేసుకుంటున్న నిర్మాతలకు.. ఇప్పుడు ఒక్కసారిగా 28 శాతం పన్ను కట్టాలంటే ఎంత భారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇంతకుముందు అసలు వినోదపు పన్నే లేకపోవడం ఏంటి అన్న సందేహం రావచ్చు. కానీ తమిళనాట పైసా పన్ను కట్టకుండా సినిమాలు రిలీజ్ చేసుకునే అవకాశం కొన్నేళ్ల నుంచి కొనసాగుతోంది. అక్కడ సినిమాలకు తమిళ పేర్లు పెట్టి.. సెన్సార్ వాళ్ల దగ్గర ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ తెచ్చుకుంటే చాలు.. 18 శాతం దాకా ఉన్న వినోదపు పన్ను రద్దు చేసేస్తారు. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకునే లాభం పొందుతూ వచ్చారు తమిళ నిర్మాతలు.

ఐతే ఒకప్పుడు కేవలం తమిళ టైటిల్ పెడితే చాలు పన్ను మినహాయింపు ఇచ్చేవాళ్లు. కానీ జయలలిత ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ మెలిక పెట్టింది. ఐతే ఇక్కడే సెన్సార్ వాళ్ల పంట పండింది. ‘క్లీన్ యు’ ఇవ్వాలంటే లంచాలు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్లు మొదలయ్యాయన్న ఆరోపణలు ముందు నుంచి ఉన్నాయి. ఇటీవలే ఈ విషయమై కమల్ గొంతెత్తాడు. మంత్రులెవరైనా అవినీతికి పాల్పడుతుంటూ సమాచారం ఇవ్వండంటూ పిలుపునిచ్చిన కమల్.. సినీ రంగంలో సెన్సార్ బోర్డు దగ్గర జరిగే అవినీతి గురించి కూడా వెల్లడించాడు. ఇప్పుడు రాజన్ అనే ఓ నిర్మాత సెన్సార్ సభ్యుల అవినీతికి సంబంధించి సంచలన ఆరోపణలు చేశాడు.

చిన్న సినిమాలైతే లక్షల్లో సమర్పించుకుంటే తప్ప ‘క్లీన్ యు’ ఇచ్చేవాళ్లు కాదని.. అదే అజిత్-విజయ్ లాంటి హీరోల సినిమాలైతే కోటి రూపాయల దాకా ఇచ్చుకోవాల్సి వచ్చేదని.. వినోదపు పన్ను మినహాయింపుతో మిగిలే ఆదాయం కూడా కోట్లల్లో ఉండటంతో నిర్మాతలు ఇక తప్పదన్నట్లు సెన్సార్ సభ్యులకు లంచం ఇచ్చేవారని.. ఇది పెద్ద దందాగా మారిందని అతనన్నాడు. ఐతే ఆ దందా నడిచినన్నాళ్లూ సైలెంటుగా ఉండి.. ఇప్పుడు జీఎస్టీ రాకతో ఆ దందాకు అవకాశమే లేని టైంలో ఈ ఆరోపణలు చేయడమే విచిత్రం.