Begin typing your search above and press return to search.

సుకుమారి మరీ కష్టపడుతోంది

By:  Tupaki Desk   |   18 Nov 2018 3:57 PM GMT
సుకుమారి మరీ కష్టపడుతోంది
X
అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో ఆమె అభిమానులు అంతా కూడా జాన్వీ కపూర్‌ లో శ్రీదేవిని చూసుకుంటున్నారు. సౌత్‌ తో పాటు - బాలీవుడ్‌ లో కూడా స్టార్‌ డం దక్కించుకున్న శ్రీదేవి తరహాలోనే జాన్వీ కూడా బాలీవుడ్‌ మరియు సౌత్‌ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకోవాలని అభిమానులు ఆశ పడుతున్నారు. మొదటి సినిమా ‘ధడక్‌’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయిన జాన్వీ కపూర్‌ ఆ చిత్రంతో నటిగా పర్వాలేదు అనిపించుకున్నా - పూర్తి స్థాయి సక్సెస్‌ మాత్రం ఆమెకు దక్కలేదు. జాన్వీ కపూర్‌ రెండవ సినిమాకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జాన్వీకి మొదటి ఆఫర్‌ ఇచ్చిన కరణ్‌ జోహార్‌ మరో ఆఫర్‌ ను కూడా ఇచ్చాడు. కరణ్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న పీరియాడిక్‌ మూవీ ‘తక్త్‌’లో జాన్వీ కీలక పాత్రలో కనిపించబోతుంది. పీరియడిక్‌ మూవీ అవ్వడంతో బాడీ లాంగ్వేజ్‌ తో పాటు పలు విషయాల్లో కఠినమైన శిక్షణను జాన్వీ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రోజుకు 14 గంటల పాటు ‘తక్త్‌’ సినిమా కోసం శిక్షణ తీసుకుంటుందని బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

అప్పట్లో శ్రీదేవి ఒకే రోజులో రెండు మూడు సినిమా షూటింగ్స్‌ కు హాజరు అయ్యేందుకు రోజులో 15 గంటల పాటు కష్టపడేదట. ఇప్పుడు అలాగే జాన్వీ కపూర్‌ కూడా కష్టపడుతోంది. ఉదయం 10 గంటల నుండి మద్య రాత్రి వరకు కూడా డాన్స్‌ - డైలాగ్‌ డెలవరీ - బాడీ లాంగ్వేజ్‌ ఇంకా పలు విషయాల్లో ట్రైనింగ్‌ తీసుకుంటుందట. ‘తక్త్‌’ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మొదలు కాబోతుంది. మొదటి సినిమాతో స్టార్‌ డం దక్కించుకోలేక పోయిన జాన్వీ రెండవ సినిమాతో అయినా దక్కించుకుంటుందేమో చూడాలి. మరో వైపు జాన్వీకి టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తన మల్టీస్టారర్‌ మూవీలో ఛాన్స్‌ ఇచ్చే విషయమై ఆలోచనలో ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.