Begin typing your search above and press return to search.

సౌత్ ఇండియా అంతటా ఎన్టీఆర్ గర్జన

By:  Tupaki Desk   |   30 Aug 2016 11:50 AM GMT
సౌత్ ఇండియా అంతటా ఎన్టీఆర్ గర్జన
X
మన హీరోలందరూ ఈ మధ్య పొరుగు మార్కెట్ల మీద బాగానే దృష్టిపెడుతున్నారీ మధ్య. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ తమిళ వెర్షన్ ‘సెల్వందన్’ కొద్దిగా మార్కెట్ సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ కు ముందు నుంచి మలయాళంలో మంచి మార్కెట్టే ఉంది. మిగతా హీరోలు కూడా నెమ్మదిగా వేరే రాష్ట్రాల్లో తమ సినిమాల్ని పెద్ద స్థాయిలో రిలీజ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఐతే ఈ విషయంలో ఎన్టీఆరే కొంచెం వెనుకబడి ఉన్నాడు. పక్క రాష్ట్రాల్లో మార్కెట్ గురించి అతను పెద్దగా పట్టించుకోలేదు ఇంత వరకూ. ఐతే ‘జనతా గ్యారేజ్’తో సీన్ మారుతోంది. ఈ సినిమాను దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ భారీగానే రిలీజ్ చేస్తున్నారు. కర్ణాటకలో తెలుగు స్టార్ హీరోల సినిమాలు భారీగా విడుదలవడం మామూలే. కాబట్టి అక్కడ ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తుండటం వల్ల కేరళలో కూడా ‘జనతా గ్యారేజ్’ను ఓ డైరెక్ట్ సినిమా తరహాలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇక తమిళంలో కూడా ఈ సినిమాకు వందకు పైగా థియేటర్లలో విడుదల చేస్తుండటం విశేషం. మోహన్ లాల్ తో పాటు సమంత.. నిత్యా మీనన్ అక్కడి వాళ్లకు బాగానే పరిచయం. ‘శ్రీమంతుడు’ తమిళ వెర్షన్ ద్వారా కొరటాల కూడా అక్కడి వాళ్లకు నోటెడ్ అయ్యాడు. ఇక పోస్టర్ మీద దేవిశ్రీ ప్రసాద్ పేరు కూడా ఉంది. మొత్తానికి ‘జనతా గ్యారేజ్’ మీద అక్కడి జనాల్లోనూ మంచి క్రేజే ఉంది. దీంతో ‘బాహుబలి’ తర్వాత అత్యంత భారీగా తమిళనాట రిలీజవుతున్న సినిమాగా ‘జనతా గ్యారేజ్’ను చెప్పుకోవాలి. వందకు పైగా స్క్రీన్లంటే మనకు చిన్న విషయమే కావచ్చు కానీ.. తక్కువ థియేటర్లుండే తమిళనాట అది బిగ్ రిలీజే. మొత్తానికి ఈ సెప్టెంబరు 1 నుంచి సౌత్ ఇండియా అంతటా యంగ్ టైగర్ గర్జన వినిపించబోతోందన్నమాట.