Begin typing your search above and press return to search.

బాలయ్య, రాజశేఖర్‌ మూవీ నిజమేనా?

By:  Tupaki Desk   |   21 March 2019 9:54 AM GMT
బాలయ్య, రాజశేఖర్‌ మూవీ నిజమేనా?
X
తమిళంలో 2017వ సంవత్సరంలో వచ్చిన 'విక్రమ్‌ వేద' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అక్కడ భారీ ఎత్తున వసూళ్లను రాబట్టి ఆ ఏడాది టాప్‌ చిత్రాల జాబితాలో నిలిచింది. మాధవన్‌ మరియు విజయ్‌ సేతుపతిలు కలిసి నటించిన ఆ చిత్రంను హిందీ మరియు తెలుగు భాషలతో పాటు ఇంకా పలు భాషల్లో రీమేక్‌ చేసేందుకు గత సంవత్సర కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులో ఈ చిత్రంను మొదట నాగార్జున చేస్తాడని, ఆయనతో పాటు మరో సీనియర్‌ హీరో కూడా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

'విక్రమ్‌ వేద' చిత్రం రీమేక్‌ గురించి టాలీవుడ్‌ లో మరో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. సీనియర్‌ హీరోలు అయిన బాలకృష్ణ మరియు రాజశేఖర్‌ లు కలిసి ఈ రీమేక్‌ ను మల్టీస్టారర్‌ గా చేయబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్రం రైట్స్‌ ను దక్కించుకున్న నిర్మాత రీమేక్‌ విషయమై రాజశేఖర్‌ తో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆయన బాలయ్య వద్దకు కూడా వెళ్లి రీమేక్‌ లో నటించాల్సిందిగా కోరనున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే రాజశేఖర్‌ ఎక్కువగా రీమేక్‌ సినిమాలపై ఆసక్తి చూపించడనే విషయం తెల్సిందే.

రాజశేఖర్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితి నేపథ్యంలో విక్రమ్‌ వేద చిత్రం రీమేక్‌ లో నటించేందుకు వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉంది. కాని బాలయ్య మాత్రం ఈ విషయంలో చాలా రకాలుగా ఆలోచిస్తాడనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒక వేళ వీరిద్దరు కూడా ఒప్పుకుంటే రీమేక్‌ భారీగా రూపొందే అవకాశం ఉంది. క్రేజీ ప్రాజెక్ట్‌ గా ఈ చిత్రం నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్‌ పోలీస్‌ పాత్రలో కనిపించగా, విజయ్‌ సేతుపతి రౌడీ పాత్రను చేశాడు. ఈ పాత్రల్లో ఏది ఎవరు చేస్తారనే చర్చ అప్పుడే సినీ వర్గాల్లో జరుగుతోంది. బాలయ్య త్వరలో బోయపాటి మూవీని చేయనుండా, ప్రస్తుతం రాజశేఖర్‌ 'కల్కి' అనే చిత్రాన్ని చేస్తున్నాడు.