Begin typing your search above and press return to search.

నందుల‌పై శివాజీ సీన్లోకి వ‌చ్చేశాడు

By:  Tupaki Desk   |   17 Nov 2017 5:46 PM GMT
నందుల‌పై శివాజీ సీన్లోకి వ‌చ్చేశాడు
X
నంది అవార్డుల వివాదం అంత‌కంత‌కూ ముదురుతోంది. ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌ల స్థాయిని దాటేసిన ఈ వివాదం మ‌రింత గ‌లీజుగా మారింది. నిన్న‌టి వ‌ర‌కూ మాట‌ల‌కే ప‌రిచ‌యం అయినోళ్లు.. ఇప్పుడు స్థాయి దిగ‌జారి బూతులు తిట్టుకోవ‌టం వ‌ర‌కూవెళ్లింది.

నాలుగు గోడ‌ల మ‌ధ్య‌నో.. ప్రైవేటు సంభాష‌ణ‌ల్లోనో మాట్లాడుకునే మాట‌ల‌న్నీ ఇప్పుడు టీవీ ఛాన‌ళ్ల ద‌గ్గ‌ర‌.. సోష‌ల్ మీడియాలోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ వివాదంలోకి లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు సినీ న‌టుడు.. క‌మ్ ఏపీ హ‌క్కుల మీద త‌ర‌చూ మాట్లాడే శివాజీ. తాజాగా నందుల ర‌చ్చ మీదా మాట్లాడేశారు.

సినిమా ఇండ‌స్ట్రీలో భ‌జ‌నప‌రులు ఉన్నార‌ని.. అలాంటి వారు ఎవ‌రు ప‌వ‌ర్ లో ఉంటే వారికి భ‌జ‌న చేస్తుంటార‌ని దుయ్య‌బ‌ట్టారు శివాజీ. భ‌జ‌న‌తో త‌మ ప‌నులు చేసుకోవ‌టం చాలా మామూలు విష‌య‌మ‌న్నారు. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల్లో మెగా ఫ్యామిలీ హీరోల‌కు నిజంగానే అన్యాయం జ‌రిగింద‌న్న శివాజీ.. కేవ‌లం టీడీపీ కోవ‌ర్టుల‌కే అవార్డుల‌న్న‌ట్లుగా ఇచ్చారంటూ ఘాటు ఆరోప‌ణ చేశారు.

కొంద‌రు వ్య‌క్తుల అభిప్రాయంతో కాకుండా.. ప్ర‌జ‌ల అభిప్రాయంతో అవార్డులు ఇస్తే గొడ‌వ ఉండ‌ద‌న్న శివాజీ గ‌తంలో త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని తెర మీద‌కు తెచ్చారు. తాను హీరోగా న‌టించిన మిస్స‌మ్మ సినిమా బాగా ఆడింద‌ని.. అందులో త‌న న‌ట‌న‌కు ఉత్త‌మ న‌టుడు అవార్డు ఇవ్వాల‌ని క‌మిటీ స‌భ్యులు కొంద‌రు అనుకున్నార‌ని.. కానీ అడ్డుకోవ‌టం త‌న‌కు ఆ అవార్డు రాలేద‌న్నారు. ఇప్ప‌టికే ముదిరిపోయిన నంది అవార్డుల వివాదం.. అంత‌కంత‌కూ లోతుల్లోకి వెళ్ల‌ట‌మే కాదు.. గ‌తాన్ని అదే ప‌నిగా త‌వ్వుకునే వ‌ర‌కు వెళుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.