Begin typing your search above and press return to search.

ప్యాకెట్లతో కాదు పాల క్యాన్లతో అభిషేకం చెయ్యండి!

By:  Tupaki Desk   |   22 Jan 2019 11:46 AM GMT
ప్యాకెట్లతో కాదు పాల క్యాన్లతో అభిషేకం చెయ్యండి!
X
తమిళ హీరో శింబుకు మిగతా హీరోలకు చాలా తేడా ఉంటుంది. కోలీవుడ్ బ్యాడ్ బాయ్ గా ఒక నెగెటివ్ ఇమేజ్ ఉన్నప్పటికీ టాలెంట్ విషయంలో మాత్రం అసలు వంక పెట్టలేం. యాక్టింగ్ కానీ.. డ్యాన్స్ గానీ ఇరగదీస్తాడు. శింబు తాజాగా 'అత్తారింటికి దారేది' రీమేక్ 'వందా రాజవతాన్ వరువేన్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 1 న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా శింబు ఫ్యాన్స్ కోసం ఒక మెసేజ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.

తన వీడియో మెసేజ్ లో ఫ్యాన్స్ ను బ్లాక్ లో టికెట్స్ కొనవద్దని కోరాడు. సినిమాను టికెట్ ధర ఎంత ఉంటే అంతకే కొని చూడాలని.. కటౌట్లు.. ఫ్లెక్సీలు కట్టొద్దని.. వీటికి ఖర్చు చేసే డబ్బుతో అమ్మనాన్నలకు బట్టలు కొనమని కోరాడు. ఎవరైనా మొదట గౌరవించాల్సింది అమ్మనాన్నలనే అని ఆ తర్వాతే అభిమాన హీరో అని.. వాళ్ళను ప్రేమగా చూసుకోవాలని కోరాడు. ఈ వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రోలర్లు కూడా రెచ్చిపోయారు. కొందరు ఇదో పబ్లిసిటీ స్టంట్ అని విమర్శిస్తే మరికొందరు 'నువ్వేమైన పెద్ద స్టారా అవన్నీ చేయడానికి. నీకుండేదే ఇద్దరు ముగ్గురు ఫ్యాన్స్' అంటూ శింబును తగులుకున్నారు.

దీంతో తిక్కరేగిన శింబు మరో వీడియో విడుదల చేశాడు. "నాకుండే ఇద్దరు ముగ్గురు ఫ్యాన్స్ కు ఇది నా రిక్వెస్ట్. గతంలో మీరు కట్టిన వాటికంటే పెద్ద పెద్ద కటౌట్లు.. బ్యానర్లు.. ఫ్లెక్సీలు కట్టండి. పాల ప్యాకెట్ లతో అభిషేకం చేయకండి.. పాల క్యాన్లతో అభిషేకం చెయ్యండి. మ్యాగ్జిమమ్ మాస్ చూపించండి.. వేరే లెవెల్ లో ఉండాలి. నాకెలాగూ ఇద్దరు ముగ్గురే ఫ్యాన్స్.. నేనేమీ పెద్ద హీరోను కాదు కాబట్టి.. వీటివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకపోవచ్చు" అంటూ ట్రోలర్లకు గట్టిగా చురకలంటించాడు. అసలే బ్యాడ్ బాయ్.. ఎందుకర్రా నెటిజనులూ ఆయన్ను కెలుకుతారు.. తిక్కరేగితే లోపలనుంచి అపరిచితుడు బైటకి వస్తాడు!