Begin typing your search above and press return to search.

ఇక్కడ గీత గోవిందం.. అక్కడ ఆ రెండూ

By:  Tupaki Desk   |   17 Aug 2018 1:30 AM GMT
ఇక్కడ గీత గోవిందం.. అక్కడ ఆ రెండూ
X
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా తెలుగులో రిలీజైన విజయ్ దేవరకొండ సినిమా ‘గీత గోవిందం’కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ముందు నుంచే మంచి హైప్ ఉండగా.. దానికి తగ్గట్లే మంచి టాక్ కూడా వచ్చింది. దీంతో తొలి రోజు వసూళ్ల మోత మోగిపోయింది. దాదాపు పది కోట్ల షేర్‌ తో ఈ చిత్రం బాక్సాఫీస్ పండితుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. గ్రాస్ రూ.16 కోట్లకు పైగా ఉండటం విశేషం. టాలీవుడ్ కు ఈ చిత్రం మాంచి ఊపునిస్తే.. ఇదే రోజు రిలీజైన రెండు హిందీ సినిమాలు బాలీవుడ్ కు ఉత్సాహాన్నిచ్చాయి. అవే.. గోల్డ్.. సత్యమేవ జయతే. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ రెండు చిత్రాలకూ మంచి రివ్యూలు వచ్చాయి. ప్రముఖ రివ్యూయర్లందరూ ఈ సినిమాలకు 3.5-4 మధ్య రేటింగ్స్ ఇచ్చారు. రెండు సినిమాల్నీ కొనియాడారు.

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘గోల్డ్’కు తొలి రోజు రూ.27 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే.. జాన్ అబ్రహాం సినిమా ‘సత్యమేవజయతే’ రూ.17 కోట్లు రాబట్టింది. ఈ హీరోల కెరీర్లో ఇవి హైయెస్ట్ తొలి రోజు గ్రాస్ కావడం విశేషం. కొంత కాలంగా సరైన విజయాల్లేని బాలీవుడ్ కు ఇవి మంచి ఉత్సాహాన్నిచ్చే వసూళ్లే. ఈ రెండు సినిమాలూ దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన చిత్రాలు కావడం విశేషం.1948 ఒలింపిక్స్‌లో మన హాకీ జట్టు స్వర్ణం గెలవడం భారత క్రీడా చరిత్రలోనే గొప్ప మైలురాయి. స్వాతంత్ర్యం తర్వాత భారత్‌ ఆడిన తొలి ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణం కావడం ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఐతే ఈ పతకం వెనుక ఉన్న కష్టాన్ని ‘గోల్డ్’లో చూపించారు. ఇంతకుముందు అమీర్ ఖాన్ కథానాయకుడిగా ‘తలాష్’ తీసిన రీమా.. ఆ తర్వాత చేసిన సినిమా ఇదే. దర్శకుడు, నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఇక నిజాయితీపరుడైన తన పోలీస్ తండ్రిని చంపిన అవినీతి వ్యవస్థపై ప్రతీకారం తీర్చుకునే కుర్రాడి కథతో తెరకెక్కిన ‘సత్యమేవ జయతే’ను మిలప్ మిలాన్ జవేరి డైరెక్ట్ చేశాడు.