Begin typing your search above and press return to search.

నిర్మాత కావాల‌నే ఆశ.. మోసగాన్ని చేసిందే!

By:  Tupaki Desk   |   11 Aug 2017 8:58 AM GMT
నిర్మాత కావాల‌నే ఆశ.. మోసగాన్ని చేసిందే!
X
నిర్మాత కావాల‌నే ఆశ‌తో.. అడ్డ‌దారులు తొక్కాడు! ఖ‌రీదైన ప్రాంతాల్లోని విలువైన ఇళ్ల‌ను పెట్టుబ‌డిగా పెట్టాడు! వెంట‌నే ఆ ఇళ్లు త‌న‌వేన‌ని నకిలీ ధ్రువ‌ప‌త్రాలు సృష్టించేశాడు! త‌ర్వాత వాటిపై వివిధ బ్యాంకుల్లో రుణం తీసుకుని.. దానిని సినిమాల‌కు పెట్టుబ‌డిగా పెట్టి సినిమాలు తీసేశాడు!! ఇలా తప్పుడు ధ్రువ‌ప‌త్రాలు సృష్టించి.. బ్యాంకుల‌కు కోట్ల‌లోనే టోక‌రా వేశాడు ఓ టాలీవుడ్ నిర్మాత‌. చివ‌ర‌కు అత‌ని మోసం బ‌ట్ట‌బ‌య‌లైంది. చివ‌రికి క‌ట‌క‌టాలు లెక్క‌పెడుతున్నాడు. ఇప్ప‌టికే ఆయ‌నపై ప‌లు కేసులు పెండింగ్‌ లో ఉన్నాయ‌ని వీరు గ‌ర్తించ‌డం గ‌మ‌నార్హం!!

షేక్ బ‌జీద్‌.. అల్ల‌రి న‌రేష్ హీరోగా వచ్చిన‌ అల్ల‌రే అల్ల‌రి - ఇటీవ‌ల శ్రీ‌కాంత్ హీరోగా విడుద‌లైన మెంట‌ల్ పోలీస్‌ - అర్జున్‌ - మ‌నీషా కొయిరాలా ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన డ‌బ్బింగ్ చిత్రం నోటుకు పోటు వంటి చిత్రాల‌కు నిర్మాత‌!! గుంటూరుకు చెందిన షేక్ బషీద్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్ 26లో ప్లాట్‌ నెంబర్ 304లో నివాసం ఉంటున్నాడు. సినిమాలపై మోజుతో విద్యాభ్యాసం మధ్యలోనే హైదరాబాదు చేరిన ఇతను వివిధ సినీ విభాగాల్లో శిక్షణ పొందాడు. అయితే నిర్మాత కావాల‌నే కోరిక‌తో స‌రికొత్త మోసాల‌కు తెర‌తీశాడు.

ఖరీదైన ప్రాంతాల్లో ఇతరుల పేరిట ఉన్న విలువైన ఆస్తులకు నకిలీ పత్రాలు తయారు చేసి, నకిలీ కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి మార్ట్ గేజ్ లోన్లు పొందాడు. విమల్‌ గోయల్‌ అనే వ్యక్తితో కలిసి జి.ఎం.జ్యుయలర్స్ ను ప్రారంభించానని చెబుతూ - బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా హిమాయత్‌ నగర్‌ శాఖ నుంచి 2 కోట్ల రూపాయల రుణం పొందాడు. ఈ రుణానికి ష్యూరిటీగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 7లో ఉన్న విలువైన భూమిని తనఖా పెట్టాడు. ఆ భూమి హైమావతి అనే మహిళకు చెందినదని బ్యాంకు అధికారులు గుర్తించి - పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచార‌ణ‌లో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి.