Begin typing your search above and press return to search.

మ‌రో రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన 'ఫిదా'!

By:  Tupaki Desk   |   19 Sep 2018 1:30 AM GMT
మ‌రో రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన ఫిదా!
X
శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వ‌చ్చిన “ఫిదా” సినిమా సైలెంట్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు సినీ ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌లికారు. ఓవ‌ర్సీస్ లో కూడా ఫిదా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. త‌న అందం, అభిన‌యంతో మ‌ల‌యాళ భామ సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. తెలంగాణ యాస‌లో సాయి ప‌ల్ల‌వి డైలాగ్స్ తెలుగు ప్రేక్ష‌కులకు చిర‌కాలం గుర్తుండిపోతాయి. బాన్సువాడ భానుమ‌తికి వెండితెర, బుల్లితెర‌ ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ హైబ్రిడ్ పిల్ల న‌ర్తించిన పాట స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో 150 మిలియన్ మార్క్ (15 కోట్లు) వ్యూస్ దాటిన తొలి తెలుగు పాటగా `వ‌చ్చిండే....పిల్లా మెల్ల‌గ వ‌చ్చిండే...`పాట రికార్డు నెల‌కొల్పింది.

"వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెటు యేసిండే గమ్మున కూసో నియ్యాడే .. కుదురుగా నిల్సోనియాడే" ...అంటూ సాయి ప‌ల్లవి అందుకున్న ప‌ల్ల‌వికి....కుర్ర‌కారు ఫిదా అయిపోయారు. యువ‌తతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆ పాట విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. విశేషమైన జనాదరణ పొందిన ఆ పాట‌ ఇప్పటికీ ప‌లు స్టేజ్ షోల, డ్యాన్స్ షో ల‌లో మార్మోగుతూనే ఉంది. యూట్యూబ్ లో ఈ పాటను ఇప్ప‌టివ‌ర‌కూ 150 మిలియన్ల (15 కోట్లు) మందికి పైగా వీక్షించారు. ఇదే విష‌యాన్ని `ఫిదా` చిత్ర ద‌ర్శ‌కుడు శేఖర్ కమ్ముల...త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. '150 మిలియన్ మార్క్ ను దాటిన తొలి తెలుగు పాట ఇదే .. అద్భుతమైన మీ స్పందనకు ధన్యవాదాలు .. ఈ మ్యాజిక్ లో భాగమైన 'ఫిదా' టీమ్ కి శుభాకాంక్షలు' అని శేఖ‌ర్ క‌మ్ముల పోస్ట్ చేశారు.