Begin typing your search above and press return to search.

ఆత్మహత్యాయత్నంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

By:  Tupaki Desk   |   18 May 2018 5:25 AM GMT
ఆత్మహత్యాయత్నంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
X
యువ కథానాయకుడు సందీప్ కిషన్.. టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ కాంబినేషన్లో ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే సినిమా తీసిన యువ దర్శకుడు రాజసింహా ముంబయిలో ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా నిన్నట్నుంచి వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజసింహా ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో కనిపిస్తున్న ఒక ఫొటో కూడా హల్ చల్ చేసింది. రాజసింహా పరిమితికి మించి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడని.. కెరీర్లో ఒడుదొడుకులు.. వ్యక్తిగత సమస్యలే ఇందుకు కారణమని ఊహాగానాలు వినిపించాయి. ఐతే ఈ వార్తలపై రాజసింహా క్లారిటీ ఇచ్చాడు. తాను అనారోగ్య సమస్యతోనే తాను ఆసుపత్రిలో చేరానన్నాడు. తన గురించి ఇంతమంది ఆందోళన చెందినందుకు థ్యాంక్స్ అన్నాడు.

తాను డయాబెటిక్ పేషెంట్ అని.. దాని వల్ల షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నానని అతను చెప్పాడు. ఆ సమయంలో తన చుట్టూ ఎవరూ లేకపోవడంతో తాను ఒత్తడికి గురయ్యానన్నాడు. మరో మూడు రోజుల్లో తాను హైదరాబాద్ వస్తానని.. వచ్చాక పూర్తి వివరాలు చెబుతానని అన్నాడు. ఐతే ఆత్మహత్యాయత్నం చేయలేదనే మాటను స్పష్టంగా రాజసింహా చెప్పలేదు. మరి హైదరాబాద్ వచ్చాక అతనేం చెబుతాడో చూడాలి. గుణశేఖర్ తీసిన ‘రుద్రమదేవి’ రచయితగా రాజసింహాకు మంచి పేరు తెచ్చింది. ఇందులో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్రను డిజైన్ చేసింది.. ఆ పాత్రకు అదిరిపోయే మాటలు రాసింది.. ఈ పాత్రకు సంబంధించి తెలంగాణ యాసపై బన్నీకి శిక్షణ ఇచ్చింది రాజసింహానే. ఆ సినిమానే అతడికి ‘ఒక్క అమ్మాయి తప్ప’తో దర్శకుడిగా మారే అవకాశమిచ్చింది. ఐతే ఈ సినిమా ఆడకపోవడంతో రాజసింహా పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం.