Begin typing your search above and press return to search.

మహర్షి మాట మీదుంటాడా!

By:  Tupaki Desk   |   17 Jan 2019 5:07 AM GMT
మహర్షి మాట మీదుంటాడా!
X
మహేష్ బాబు సినిమా అంటే జానర్ ఏదైనా సరే అంచనాలు ఆకాశాన్ని దాటడం సహజం. అందులోనూ క్రేజీ కాంబినేషన్ అంటే వేరే చెప్పాలా. అయితే షూటింగ్ మొదలు పెట్టిన టైం లో ఏప్రిల్ 5 విడుదలంటూ ముందు నుంచి ఊరిస్తూ వచ్చిన మహర్షి టీం ఇప్పుడు హటాత్తుగా మాట మార్చిన సంగతి తెలిసిందే. దీని పట్ల మహేష్ ఫ్యాన్స్ బాగా అసహనంతో ఉన్నారు. డిసెంబర్ నుంచే సోషల్ మీడియాలో వంద రోజుల కౌంట్ డౌన్ అంటూ మొదలు పెట్టి పాపం సంబరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడా ఆశలకు నీళ్ళు పడ్డాయి.

అయితే దీనికి నిర్మాత నుంచి వినిపిస్తున్న కారణం భలే వింతగా ఉంది. ఏప్రిల్ మొదటివారం కంటే చివరి వారం అయితేనే సెంటిమెంట్ గా మహేష్ కు కలిసి వస్తుందట. గత ఏడాది వచ్చిన భరత్ అనే నేనుని ఉదాహరణగా చూపుతున్నారు. అయితే అది వచ్చింది మూడో వారంలో. పోకిరిని కూడా ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు లెండి. ముగ్గురు నిర్మాతలున్నా కీలకమైన బాధ్యతలు మోస్తున్న దిల్ రాజు టీమ్ చెబుతున్న వెర్షన్ లో చిన్న లాజిక్ మిస్ అవుతోంది. మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు సీజన్ తో సంబంధం లేదు. కంటెంట్ ఉంటే ఎప్పుడు వచ్చినా దుమ్ము దులుపుతాయి. ఇది అందరికి వర్తిస్తుంది.

రంగస్థలం మార్చి చివరి వారంలో వచ్చి నాన్ బాహుబలి రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం మర్చిపోకూడదు. సో ఇది దర్శకుడు వంశీ పైడిపల్లి చేస్తున్న జాప్యం తప్ప మరొకటి కాదని ఫిలిం నగర్ టాక్. అయినా సెంటిమెంట్ల ప్రకారం డేట్లు చూసుకోవడం సహజమే కానీ మరీ ఫలానా టైంలోనే వస్తే హిట్ అవుతాయి అని చెప్పుకోవడం మాత్రం లాజిక్ కి దూరంగా ఉంది బాసూ. సరే ఏప్రిల్ 26 అంటూ అనధికారికంగా డేట్ చెబుతున్నారు. పోనీ అదైనా గ్యారెంటీగా చెప్పగలరా.