Begin typing your search above and press return to search.

దిల్ రాజు మాట నిజమా.. అతిశయోక్తా?

By:  Tupaki Desk   |   9 Aug 2018 5:49 AM GMT
దిల్ రాజు మాట నిజమా.. అతిశయోక్తా?
X
మొత్తానికి టాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్లీ కొంచెం ఊపొచ్చింది. గత వారం విడుదలైన ‘గూఢచారి’.. ‘చి ల సౌ’ మంచి టాక్ తెచ్చుకుని వాటి వాటి స్థాయిలో మంచి వసూళ్లే రాబడుతూ సాగిపోతున్నాయి. ఈ వారం విడుదలవుతున్న రెండు సినిమాల మీదా మంచి అంచనాలే ఉన్నాయి. అందులో ప్రధానంగా తెలుగు ప్రేక్షకులు దృష్టిసారిస్తున్న సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్న రూపొందించిన చిత్రమిది. నితిన్-రాశి ఖన్నా జంటగా నటించారు. శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ ప్రకటించినప్పటి నుంచి నుంచి ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ ఉన్న మాట వాస్తవం. దీనికి తోడు దీని ప్రోమోలు మరింతగా ఆ ఫీల్ ను పెంచాయి. టీజర్.. ట్రైలర్ రెండూ కూడా ప్లెజెంట్ గా అనిపించాయి.

ఐతే ప్రేక్షకుల్లో అప్పటికే పెరిగిన అంచనాల్ని దిల్ రాజు అండ్ టీం తమ మాటలతో మరింతగా పెంచేశారు. తమ సంస్థలో ‘బొమ్మరిల్లు’ తర్వాత ఆ స్థాయి సినిమా ఇదే అని దిల్ రాజు అన్నాడు. బయ్యర్లకు ముందే సినిమా చూపించానని.. వాళ్లందరూ చాలా హ్యాపీ అని.. చాలా పెద్ద విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారని కూడా రాజు చెప్పాడు. నితిన్ అయితే తన కెరీర్లో ఇదే బెస్ట్ ఫిల్మ్ అని తేల్చేశాడు. చిత్ర బృందంలోని మిగతా వాళ్లు కూడా ఈ సినిమా గురించి ఓ రేంజిలో చెప్పారు. ఈ మాటలు సినిమా మీద అంచనాల్ని మరీ పెంచేయడం చేటు చేస్తుందేమో అన్న ఆందోళనా లేకపోలేదు. మరి అంతగా చెప్పిన సినిమాలో ఏమాత్రం విషయం ఉందో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ చిత్రానికి బుకింగ్స్ అయితే ఓ మోస్తరుగానే అయ్యాయి. సినిమా వచ్చే టాక్ ను బట్టి పుంజుకోవడమో.. ఇంకా పడిపోవడమో జరుగుతుంది. ‘శ్రీనివాస కళ్యాణం’పై బయ్యర్లు రూ.25 కోట్లకు పైనే పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.