Begin typing your search above and press return to search.

దాస‌రి ఎట్ట‌కేల‌కు.. రెండు నెల‌ల త‌ర్వాత‌..

By:  Tupaki Desk   |   28 March 2017 5:59 PM GMT
దాస‌రి ఎట్ట‌కేల‌కు.. రెండు నెల‌ల త‌ర్వాత‌..
X
రెండు నెల‌ల కింద‌ట అనుకోకుండా తీవ్ర అనారోగ్యం పాలై హైద‌రాబాద్ లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ఎట్ట‌కేల‌కు పూర్తి ఆరోగ్యం సంత‌రించుకున్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న్ని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి చేశారు. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ జనవరి 29న దాసరి కిమ్స్‌ లో చేరారు.

ఊపిరితిత్తుల్లోని ఇన్‌ ఫెక్షన్‌ తొల‌గిస్తున్న సమయంలో దాసరికి గుండెపోటు రావడం.. కిడ్నీల పనితీరు మందగించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్‌ నిర్వహించాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. కిమ్స్ ఆసుపత్రి సీఈవో భాస్కర్ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం రెండు నెల‌లుగా దాసరికి ప్ర‌త్యేక చికిత్స అందిస్తోంది. ప్రాణాపాయ స్థితి నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ప్ప‌టికీ.. పూర్తిగా కోలుకోవ‌డానికి దాస‌రికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. ఎట్ట‌కేల‌కు ఆయ‌న సంపూర్ణ ఆరోగ్య‌వంతుడ‌య్యారు.దాసరి కలకాలం ఆరోగ్యంగా జీవించాలని కిమ్స్ వైద్యం బృందం ఈ సందర్భంగా ఆకాక్షించింది.

ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కులా ఉండే దాస‌రి.. ఉన్న‌ట్లుండి తీవ్ర అనారోగ్యం పాలై.. వెంటిలేట‌ర్ మీద చికిత్స అందుకునే స్థితికి చేర‌డంతో తెలుగు ప‌రిశ్ర‌మ అంతా తీవ్ర ఆందోళ‌న చెందింది. ఎట్ట‌కేల‌కు ఆయ‌న కోలుకుని మామూలు మ‌నిషి కావ‌డం ప‌ట్ల అంద‌రూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.