Begin typing your search above and press return to search.

మోహన్ బాబు మోసం.. దాసరి కోడలు సంచలనం

By:  Tupaki Desk   |   23 March 2019 8:02 AM GMT
మోహన్ బాబు మోసం.. దాసరి కోడలు సంచలనం
X
తన విద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ను చంద్రబాబు సర్కారు విడుదల చేయడం లేదని రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసిన నటుడు మోహన్ బాబుపై కౌంటర్ అటాక్స్ కొనసాగుతున్నాయి. ఇది జరిగిన కొద్ది సేపటికే ఏపీ ప్రభుత్వం తరుఫున కుటుంబ రావు.. మోహన్ బాబుకు కౌంటర్ ఇవ్వగా.. తాజాగా దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు కోడలు సుశీల మీడియా ముందుకొచ్చి మోహన్ బాబు మీద సంచలన కామెంట్స్ చేశారు.

దాసరి సుశీల మాట్లాడుతూ.. దాసరి కుటుంబానికి మోహన్ బాబు తీరని అన్యాయం చేశాడని ఆరోపించింది. చంద్రబాబు వల్ల తన కాలేజీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని అంటున్న మోహన్ బాబుకు కౌంటర్ ఇచ్చింది. ఇదే మోహన్ బాబు వల్ల మా కుటుంబంలో దాసరిగారి మనవడికి అన్యాయం జరిగిందని సుశీల మండిపడ్డారు.

మామ దాసరి నారాయణ రావు గారు ఆస్తులు పంచుతామని చెప్పి సడన్ గా చనిపోయారని.. అప్పుడు మోహన్ బాబు మధ్యవర్తిత్వం చేసి పెద్దమనిషిగా ఆస్తులు పంచుతానని చెప్పి ఆ తర్వాత దాటవేశాడని సుశీల విమర్శలు గుప్పించారు. మా మరిది దాసరి అరుణ్ కుమార్ కు మేలు చేసేందుకు మోహన్ బాబు ఇలా చేశాడని సుశీల మండిపడ్డారు.

ఆస్తుల పంపకంపై మరిది దాసరి అరుణ్ ను అడిగితే మోహన్ బాబు రావాలంటున్నారని.. మోహన్ బాబును అడిగితే తనకేం సంబంధం లేదని తప్పించుకుంటున్నాడని సుశీల మండిపడ్డారు. దాసరి కుటుంబ సభ్యుడిని అని చెప్పుకునే మోహన్ బాబు ఇలా దాసరి మనవడికి అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవడం లేదని సుశీల ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక సుశీల ఆరోపణలపై దాసరి కొడుకు అరుణ్ కూడా స్పందించారు. తమ కుటుంబ ఆస్తుల వివాదంలోకి మోహన్ బాబును లాగడం వెనుక పెద్ద కుట్ర ఉందని దాసరి అరుణ్ కుమార్ ఆరోపించారు. సుశీల ఏదైనా ఉంటే తనతో చెపితే పరిష్కరిస్తామని.. దాసరి పేరు లాగుతూ మీడియాకు ఎక్కడం మంచిదికాదన్నారు. దాసరి మరణించాక మోహన్ బాబు తమకు పెద్దదిక్కుగా మారారని అరుణ్ చెప్పుకొచ్చాడు.