Begin typing your search above and press return to search.

మహేష్-చరణ్.. సేమ్ టు సేమ్

By:  Tupaki Desk   |   24 April 2018 11:02 AM GMT
మహేష్-చరణ్.. సేమ్ టు సేమ్
X
తెలుగులో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకడు. అతడితో పోలిస్తే రామ్ చరణ్ మార్కెట్ తక్కువే. మహేష్ సినిమాలకు 100 కోట్ల బిజినెస్ జరుగుతున్నపుడు చరణ్ 50 కోట్ల రేంజిలోనే ఉణ్నాడు. కానీ ‘ధృవ’తో అతడి రేంజ్ పెరిగింది. సుకుమార్ లాంటి మేటి దర్శకుడితో జట్టు కట్టడంతో ‘రంగస్థలం’లో అతడి మార్కెట్ బాగా విస్తరించింది. ఈ చిత్రానికి రూ.110 కోట్ల దాకా బిజినెస్ జరగడం విశేషం. థియేట్రికల్ హక్కుల్నే రూ.85 కోట్ల దాకా అమ్మారు. ఇక ఈ చిత్ర వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా రూ.110 కోట్ల షేర్‌ తో నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పింది.

మహేష్ కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ ఆ రికార్డును బద్దలు కొడుతుందా లేదా అనే చర్చ నడుస్తోంది ప్రస్తుతం. విశేషం ఏంటంటే.. తొలి మూడు రోజుల్లో ‘భరత్ అనే నేను’.. ‘రంగస్థలం’ వసూళ్లు దాదాపు సమానంగా ఉన్నాయి. చరణ్ సినిమా వీకెండ్లో వరల్డ్ వైడ్ రూ.56.96 కోట్ల షేర్.. రూ.90.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. మహేష్ మూవీ కొంచెం ఎక్కువగా రూ. 57.4 కోట్ల షేర్.. రూ.93 కోట్ల గ్రాస్ తెచ్చుకుంది. ఐతే తెలుగు రాష్ట్రాల వరకు ‘భరత్ అనే నేను’ కంటే ‘రంగస్థలం’ కాస్త పైచేయి సాధించడం విశేషం. చరణ్ సినిమా ఇక్కడ రూ.38.6 కోట్ల షేర్.. రూ.57.2 కోట్ల గ్రాస్ రాబట్టింది. నైజాం షేర్ రూ.10.66 కోట్లు. ఇక మహేష్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ.38.3 కోట్ల షేర్.. రూ.56 కోట్ల గ్రాస్ రాబట్టింది. నైజాం షేర్ రూ.10.2 కోట్లు. దీన్ని బట్టి చూస్తే చరణ్ మార్కెట్ ఒక్కసారిగా అమాంతం పెరగ్గా.. మహేష్ స్థాయి కొంచెం తగ్గినట్లే అనిపిస్తోంది.