Begin typing your search above and press return to search.

సెన్సార్ చిక్కుల్లో సాక్ష్యం?

By:  Tupaki Desk   |   21 July 2018 6:38 AM GMT
సెన్సార్ చిక్కుల్లో సాక్ష్యం?
X
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన సాక్ష్యం విడుదలకు సరిగ్గా వారం రోజులు మాత్రమే ఉంది. దర్శకుడు శ్రీవాస్ విలన్ జగపతిబాబు ఒకటీ ఆరా ఇంటర్వ్యూలు తప్ప ప్రమోషన్ విషయంలో దూకుడు కనిపించడం లేదు. ఫాంటసీ నేపధ్యంలో రూపొందిన ఇలాంటి సినిమాలను జనం మనసులోకి రిజిస్టర్ అయ్యేలా తీసుకెళ్లడం చాలా అవసరం. కానీ సాక్ష్యం టీమ్ ఎందుకు సైలెంట్ గా ఉందా అనే అనుమానం ఫిలిం నగర్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. కానీ ప్రొడక్షన్ టీమ్ సెన్సార్ విషయంలో పడుతున్న టెన్షన్ వల్లే వాటి మీద ఫోకస్ పెట్టడం లేదని తాజా సమాచారం. సెన్సార్ కు వెళ్లిన సాక్ష్యంలో కొన్ని జంతువులతో తీసిన సన్నివేశాలు ఉండటంతో వాటికి సంబందించిన అనుమతి పత్రాలు చూపమని అధికారులు అడగటంతో అప్పటికప్పుడు వాటిని ఇవ్వలేక కొంత సమయం అడిగినట్టు సమాచారం. చేతిలో ఉన్నది ఐదు రోజులే కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ని తెచ్చే పనిలో పడ్డారట యూనిట్ సభ్యులు. మరి ముందుగా అనుమతి తీసుకుని జంతువులను వాడారా లేక పత్రాలు ఎక్కడైనా మిస్ అయ్యాయా అనే సమాచారం రావాల్సి ఉంది.

మంగళవారంలోపు సదరు ఎన్వోసిలను సాక్ష్యం టీమ్ సబ్మిట్ చేయాలి. ఏ మాత్రం ఆలస్యం జరిగినా వాయిదా తప్పదు. మంచి టైం చూసుకుని పోటీ లేకుండా బరిలో దిగుతున్న సాక్ష్యంకు ఇది ఊహించని ఝలక్. గతంలోలాగా సినిమాల్లో తోచిన రీతిలో జంతువులను వాడడానికి లేదు. వాటి పరిరక్షణ చట్టాలు చాలా కఠినంగా అమలవుతున్నాయి. అందుకే అధిక శాతం దర్శక నిర్మాతలు ఈ మధ్య చిన్న కోడిపెట్టను చూపాలన్నా గ్రాఫిక్స్ ని ఆశ్రయిస్తున్నారు. వాటిని నిజంగా ఉపయోగించి అనుమతులు తెచ్చుకునే టైం వ్యయం కన్నా ఇదే చీప్ అని ఫీల్ కావడమే దీనికి కారణం. కానీ సాక్ష్యం కేసు వేరు. కథ డిమాండ్ మేరకు నిజమైన జంతువులని వాడారట. మరి ఈ చిక్కుల్లో నుంచి సెన్సార్ తీసుకుని బయటపడితేనే సాక్ష్యం రూట్ క్లియర్ అవుతుంది. టైం లేదు కాబట్టి దాని గురించి ఉరుకులుపరుగులు పెడుతోంది టీమ్. పోటీగా ప్రస్తుతానికి నీహారిక నాగ అశ్విన్ హ్యాపీ వెడ్డింగ్ మాత్రమే ఉంది. సుశాంత్ చిలసౌ అన్నారు కానీ ఇంకా ఖరారు చేయలేదు.