Begin typing your search above and press return to search.

తేజ మారిపోయాడంటున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   26 July 2017 11:19 AM GMT
తేజ మారిపోయాడంటున్న హీరోయిన్
X
దర్శకుడు తేజ చాలా కోపిష్టి అన్న అభిప్రాయం ఉంది టాలీవుడ్లో. ఆయన నటీనటుల్ని కొడతారని.. తాను చెప్పినట్లు చేయకపోతే చాలా కోపం వచ్చేస్తుందని అంటారు. ఈ విషయంలో తనకు కూడా ఇన్ పుట్స్ వచ్చాయని.. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు తనను ఎంపిక చేసినపుడు తేజతో ఎలా పని చేయాలా అని కంగారు పడ్డానని అంటోంది కేథరిన్ థ్రెసా. ఐతే షూటింగుకి వెళ్లాక తన అపోహలన్నీ తొలగిపోయాయని ఆమె చెప్పింది.

‘‘తేజ గారు నాకు తెలియక ముందు ఆయన గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఐతే ఇప్పుడు ఆయన మారిపోయారో ఏమో కానీ.. నేను అనుకున్నట్లుగా అయితే లేరు. సెట్లో చాలా సరదాగా ఉంటారు. ఆయనతో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘నేనే రాజు నేనే మంత్రి’ చాలా కొత్తగా ఉంటుంది. స్టీరియో టైపు కథలు.. పాత్రల్ని బ్రేక్ చేసేలా ఉంటుందీ సినిమా’’ అని కేథరిన్ చెప్పింది.

ఇంతకుముందు ఇద్దరమ్మాయిలతో.. సరైనోడు సినిమాల్లో.. ఇప్పుడు ‘నేనే రాజు నేనే మంత్రి’.. ‘గౌతమ్ నంద’ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలే చేయడంపై కేథరిన్ స్పందిస్తూ.. ‘‘నా పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందా అని చూస్తా తప్ప ఫస్ట్ హీరోయినా.. సెకండ్ హీరోయినా అని కాదు. పాత్ర నచ్చితే నాకు ఎలాంటి పట్టింపులూ ఉండవు’’ అని ఆమె చెప్పింది. ‘గౌతమ్ నంద’ కోసం తొలిసారి తనే డబ్బింగ్ చెప్పుకున్నానని.. ఈ ప్రపోజల్ తనే దర్శకుడు సంపత్ నంది ముందు పెట్టానని.. అతను వాయిస్ టెస్ట్ చేసి ఓకే చెప్పాడని.. ఉస్మానియాలో పని చేసే ఒక లెక్చరర్ దగ్గర తెలుగు ట్రైనింగ్ తీసుకుని డబ్బింగ్ చెప్పుకున్నానని కేథరిన్ చెప్పింది.