Begin typing your search above and press return to search.

భాగ్యనగరిలో క్యాథరిన్ మకాం

By:  Tupaki Desk   |   26 July 2017 9:40 AM GMT
భాగ్యనగరిలో క్యాథరిన్ మకాం
X
మాకు తెలుగు భాష బాగా నచ్చింది. హైదరాబాద్ ఇంకా నచ్చేసింది... వేరే రాష్ట్రాల నుంచి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ప్రతి హీరోయిన్ రొటీన్ గా చెప్పే మాటే ఇది. మాటలతో సరిపెట్టడం కాకుండా టాలీవుడ్ లో నిలదొక్కుకున్నాక ఇక్కడ సెటిలైన హీరోయిన్లు తక్కువే. ఈ ట్రెండ్ ఈ మధ్య కాస్త మారింది. హైదరాబాద్ లో సెటిలవడంపై హీరోయిన్లు ఫోకస్ చేశారు.

నాగచైతన్యను పెళ్లి చేసుకుని తెలుగు వారింటి కోడలు కాబోతున్న సమంత ఇప్పటికే ఇక్కడ ఓ ఫ్లాట్ కొనుక్కుంది. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ డ్యూప్లెక్స్ హౌస్ కొనేసింది. దాంతోపాటు ఇక్కడే జిమ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. వీరికితోడు ఇప్పుడు కొత్తగా క్యాథరిన్ థ్రెసా జాయినైంది. ఈ బెంగుళూరు భామ సినిమాలు వరసగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. గోపీచంద్ పక్కన హీరోయిన్ గా నటించిన గౌతమ్ నందా ఈ వీక్ లోనే థియేటర్లకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా క్యాథరిన్ మాట్లాడుతూ హైదరాబాద్ తనకు ఎంతో నచ్చేసిందని.. అందుకు ఫిలిం ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే పోష్ లొకాలటీలో రీసెంట్ గా ఓ ఫ్లాట్ కొనుక్కున్నానని చెప్పింది. దాంతో పాటు తెలుగు భాషపై పట్టు పెంచుకునేందుకు ఓ ట్యూటర్ ను కూడా పెట్టుకున్నానని తెలిపింది. ముందుముందు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునేలా తెలుగులో గలగలా మాట్లాడేస్తానని అంటోంది.

గౌతమ్ నందా తర్వాత క్యాథరిన్ నటించిన మరో రెండు సినిమాలు ఆగస్టులో థియేటర్లకు రానున్నాయి. తేజ డైరెక్షన్ లో రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి.. బోయపాటి శ్రీను డైరెక్షన్ లొ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా జయ జానకి నాయక ఆగస్టు రెండో వారంలో రిలీజవుతున్నాయి. ఇవన్నీ భారీ చిత్రాలే కావడం విశేషం. వరసగా మంచి ఆఫర్లు లభిస్తున్నందున భాగ్యనగరంలో సెటిలవ్వాలని ఫిక్సయిపోయింది.