Begin typing your search above and press return to search.

జ‌య‌జాన‌కీ నాయ‌క బ‌కాయిలు కాస్తా కేసైంది

By:  Tupaki Desk   |   17 Aug 2017 6:09 AM GMT
జ‌య‌జాన‌కీ నాయ‌క బ‌కాయిలు కాస్తా కేసైంది
X
ఇటీవ‌ల విడుద‌లైన జ‌య‌జాన‌కీ నాయ‌క చిత్రంపై ఇప్పుడో కేసు న‌మోదైంది. ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన బ‌కాయిల్ని చెల్లించ‌లేదని అడిగిన దానికి తిట్ట‌ట‌మే కాదు.. డ‌బ్బులు ఎగ్గొట్టారంటూ ఒక‌రు ఇచ్చిన ఫిర్యాదుతో కేసును న‌మోదు చేశారు. ఇంత‌కీ.. ఈ బ‌కాయిల వివాదం ఏమిట‌న్న‌ది చూస్తే.. కృష్ణాన‌గ‌ర్ కు చెందిన పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి గ‌త డిసెంబ‌రు నుంచి జ‌న‌వ‌రి 2 వ‌ర‌కు అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగిన జ‌య‌జాన‌కీ నాయ‌క చిత్ర పాట చిత్రీక‌ర‌ణ కోసం 250 ఎల్ఈడీ ట్యూబులు.. 250 కాయిన్ లైట్లు స‌ర‌ఫ‌రా చేశారు.

దీనికి సంబంధించి రూ.10.75 ల‌క్ష‌ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. షూటింగ్ పూర్తి అయిన త‌ర్వాత త‌న‌కు రావాల్సిన బిల్లు కోసం వెళితే ఇవ్వ‌లేద‌న్న‌ది బాధితుడి ఆరోప‌ణ‌. ఒక‌టికి ప‌దిసార్లు తిప్పించుకున్నాక బెదిరిస్తున్నార‌ని.. నిర్మాత బెల్లంకొండ సురేశ్ తో పాటు ఈ చిత్ర నిర్మాత ర‌వీంద‌ర్ రెడ్డితో మాట్లాడితే త‌ర్వాత ఇస్తామ‌ని ఫిర్యాదుదారుడు త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బ‌కాయిల గురించి మాట్లాడేందుకు తాను వెళితే.. మేనేజ‌ర్ కిషోర్ త‌న‌ను చంపేస్తాన‌ని బెదిరించిన‌ట్లుగా పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు మేనేజ‌ర్ కిషోర్ పై కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.