Begin typing your search above and press return to search.

అన్ని విధాలా మునిగిన బాలయ్య నిర్మాత!?

By:  Tupaki Desk   |   17 Dec 2018 2:43 PM GMT
అన్ని విధాలా మునిగిన బాలయ్య నిర్మాత!?
X
ఆనంద్ ప్రసాద్.. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి. ఆ నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువని.. కమ్మ సామాజిక వర్గానికి మంచి పట్టుందని.. ఆయన్ని తెలుగుదేశం తరఫున నిలబెట్టారు. మొదట్లో ఆయన విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు మద్దతుదారులు. కానీ పూర్తిగా దిగాక కానీ లోతు అర్థం కాలేదు. తెరాస అభ్యర్థి ఆరికపూడి గాంధీ నుంచి గట్టి పోటీ తప్పదని అర్థమైంది. తర్వాత తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. గాంధీ ఈయనకు పోటీ ఇవ్వడం కాదు.. ఆయన్ని అందుకోవడం ఆనంద్ ప్రసాద్ కే కష్టమని అర్థమైంది. ఆ పరిస్థితుల్లో విజయం కోసం ఆనంద్ ప్రసాద్ భారీగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాజకీయాలకు కొత్త కావడంతో కార్యకర్తల్ని సమీకరించుకోవడం.. రోజూ ప్రచారం నిర్వహించడానికే ఆయనకు భారీగా ఖర్చయింది. రోజుకు రూ.50 లక్షలకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందట. దీనికి తోడు ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి పంపకాలకు కూడా భారీగా ఖర్చు చేయాల్సి వచ్చినట్లు సమాచారం. ఐతే ఇంత చేసినా ఫలితం లేకపోయింది. టీఆర్ఎస్ వేవ్ లో గాంధీ దూసుకెళ్లారు. ఆయన ముందు ఆనంద్ ప్రసాద్ నిలవలేకపోయారు. ఘోర పరాజయం చవిచూశారు. ఆనంద్ కు టికెట్ రావడానికి ముఖ్య కారణం బాలయ్యే. గత ఏడాది బాలయ్యతో ‘పైసా వసూల్’ సినిమాను నిర్మించాడు ఆనంద్. ఆ సందర్భంగా ఇద్దరికీ దోస్తీ కుదిరింది. ‘పైసా వసూల్’ డిజాస్టర్ అయి ఆనంద్ భారీగా నష్టపోయాడు. అంతకుముందు ఆయన నిర్మించిన సినిమాలు కూడా ఆడలేదు. దీంతో ఆయన్ని ఆదుకునే ప్రయత్నంలో భాగంగా శేరిలింగంపల్లి టికెట్ ఇప్పించాడు బాలయ్య. ఎంతో పోటీ మధ్య ఈ టికెట్ సంపాదించిన ఆనంద్ ప్రసాద్.. విజయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావించాడు. అందుకోసం కన్నూ మిన్నూ తెలియకుండా ఖర్చు చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. అటు సినిమాల్లో పోగొట్టుకున్నది చాలదన్నట్లు.. ఎన్నికల్లో రూ.50 కోట్ల దాకా పోగొట్టుకున్నట్లు సమాచారం. ఆయన నేతృత్వంలో నడుస్తున్న సిమెంట్ వ్యాపారం పరిస్థితి కూడా ఇప్పుడేమంత బాగా లేదని అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఈ దెబ్బ కోలుకోలేనిదే.