Begin typing your search above and press return to search.

బాలయ్య మనసు గెలిచిన గోపీచంద్

By:  Tupaki Desk   |   2 Dec 2015 6:32 AM GMT
బాలయ్య మనసు గెలిచిన గోపీచంద్
X
నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీ హీరోల సినిమాల ఫంక్షన్ లకే రావడం లేదు ఈ మధ్య. ఓ పక్క సినిమాలతో, మరో పక్క రాజకీయాలతో తీరిక లేకుండా ఉన్నారాయన. ఇలాంటి సమయంలో ఆయన వేరే హీరో సినిమా ఆడియో ఫంక్షన్ కు రావడం విశేషమనే చెప్పాలి. ఐతే గోపీచంద్ ఆ అదృష్టాన్ని దక్కించుకున్నాడు. తన సొంత ఊరు ఒంగోలులో జరగబోయే ‘సౌఖ్యం’ సినిమా ఆడియో ఫంక్షన్ కు బాలయ్యను రప్పించబోతున్నాడు గోపీచంద్.

హైదరాబాద్ లో అయినా ఓకే కానీ... ఒంగోలులో ఫంక్షన్ పెట్టుకుని బాలయ్యను ఆ వేడుకకు ముఖ్య అతిథిగా రప్పించబోతుండటం విశేషమే. గోపీచంద్ స్వయంగా బాలయ్యను కలిసి ఈ వేడుకకు ఆహ్వానించగా ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ నెల 13న ‘సౌఖ్యం’ ఆడియో విడుదల కాబోతోంది.

‘సౌఖ్యం’ దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి బాలయ్యతో ‘వీరభద్ర’ సినిమా తీశాడు. అది పెద్ద ఫ్లాప్ అయినా బాలయ్యతో అతడికి మంచి అనుబంధమే ఉంది. బాలయ్య సినిమా ‘డిక్టేటర్’కు పని చేస్తున్న రచయితలు కోన వెంకట్-గోపీ మోహన్ ‘సౌఖ్యం’కు కూడా మాటలందించారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఆడియో ఫంక్షన్ కు రావడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ సరసన రెజీనా కథానాయికగా నటించిన ‘సౌఖ్యం’ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.