Begin typing your search above and press return to search.

మళ్లీ అశ్వినీదత్ మ్యాజిక్

By:  Tupaki Desk   |   20 Oct 2017 3:30 PM GMT
మళ్లీ అశ్వినీదత్ మ్యాజిక్
X
తెలుగు సినిమా చరత్రలో అశ్వినీదత్ ప్రస్థానం ఒక ప్రత్యేక అధ్యాయమే. ఎన్టీఆర్.. చిరంజీవి.. నాగార్జున.. వెంకటేష్ లాంటి స్టార్లతో భారీ సినిమాలు నిర్మించిన నిర్మాత ఆయన. వైజయంతీ మూవీస్ అంటే చాలు.. ఆ సినిమాల స్థాయే వేరుగా ఉంటుంది. ఆయన సెట్ చేసే కాంబినేషన్లు.. తీసే సినిమాలు చాలా భారీగా ఉంటాయి. ఐతే దశాబ్దం కిందటి వరకు అశ్వినీదత్ విరామం లేకుండా సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ కంత్రి.. శక్తి.. కథానాయకుడు లాంటి ఫ్లాపులతో ఆయన జోరు తగ్గిపోయింది. సినీ నిర్మాణానికి విరామం ఇచ్చేసి సైలెంటుగా ఉండిపోయారు. ఈ గ్యాప్ లో ఆయన కూతుళ్లు ప్రియాంక.. స్వప్న కొన్ని చిన్న సినిమాలు నిర్మించారు.

ఐతే అశ్వినీదత్ మళ్లీ ఇప్పుడు తనదైన శైలిలో సినిమాలు నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. తన కూతుళ్లు మొదలుపెట్టిన ‘స్వప్న సినిమా’ బేనర్ ను పక్కన పెట్టి ‘వైజయంతీ మూవీస్’ పతాకం మీదే ఆయన భారీ సినిమాలకు ప్రణాళికలు రచించారు. ఆల్రెడీ ఈ బేనర్ మీద ‘మహానటి’ లాంటి ప్రెస్టీజియస్ మూవీ తెరకెక్కుతోంది. దీంతో పాటు దిల్ రాజు భాగస్వామ్యంలో మహేష్ బాబు-వంశీ పైడిపల్లి సినిమాను అశ్వినీదత్తే నిర్మిస్తున్నారు. తాజాగా దత్ బేనర్ నుంచి మరో భారీ సినిమా ప్రకటన వచ్చింది. అదే.. నాగార్జున-నాని కాంబినేషన్లో తెరకెక్కబోయే మల్టీస్టారర్. ఈ చిత్రాన్ని ‘భలే మంచి రోజు’.. ‘శమంతకమణి’ చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి వచ్చే ఏడాదంతా దత్ హవా సాగబోతోందని అర్థమవుతోంది. ఈ మూడు సినిమాలూ ఆరు నెలల వ్యవధిలో రిలీజయ్యే అవకాశముంది. ఇవి బాగా ఆడితే.. దత్ మున్ముందు మరిన్ని భారీ సినిమాల్ని లైన్లో పెడతారేమో.