Begin typing your search above and press return to search.

సైరా కోసం రాజీ అన్న‌దే లేదు- రాజీవ‌న్

By:  Tupaki Desk   |   11 Sep 2019 7:28 AM GMT
సైరా కోసం రాజీ అన్న‌దే లేదు- రాజీవ‌న్
X
1500 జ‌త‌ల దుస్తులు -22 మంది టైల‌ర్లు.. 64 గ్రామాలు- 42 భారీ సెట్లు.. 1500 మంది బ్రిటీష్ సైన్యం- 200 డ‌మ్మీ రైఫిల్స్.. 28 రోజుల పాటు వార్ సీక్వెన్స్ ల‌ ప్రిప‌రేష‌న్.. కేవ‌లం రైఫిల్స్ కి ఖ‌ర్చు చేసింది ఓ రెండు మూడు చిన్న సినిమాల బ‌డ్జెట్ అంత‌... ఇదంతా దేనికోసం అంటే.. `సైరా-న‌ర‌సింహారెడ్డి` గ్రాండియారిటీ కోసం. హిస్ట‌రీని రిపీట్ చేసేందుకు. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన ఈ చిత్రానికి కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ అధినేత రామ్ చ‌ర‌ణ్ ఎంత ఎఫ‌ర్ట్ పెట్టారో ఈ వివ‌రాల్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

అస‌లు ప్రీ ప్రొడ‌క్ష‌న్ మొద‌లు క‌ళాద‌ర్శ‌కుడిగా త‌న అనుభ‌వాల్ని ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ రాజీవ‌న్ ప్ర‌తిదీ పూస గుచ్చిన‌ట్టు చెప్పారు. మార్చి 2017లో సైరా ప్రాజెక్ట్ ప్రీప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ మొద‌లైతే ఆర్నెళ్లు పైగానే స్కెచ్ లు వ‌గైరా రెడీ చేయాల్సొచ్చింది. ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల తీరు తెన్నులు ఎలా ఉంటాయి? ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయి? లుక్ ఏంటి? కాస్ట్యూమ్స్ ఏమిటి? ఎన్ని విలేజీలు.. ఎంత‌మంది బ్రిటీష్ సైన్యం.. లొకేష‌న్లు ఏమిటి? ఇవ‌న్నీ చెక్ చేసుకునేందుకే ముంద‌స్తు ప‌నుల‌కు చాలా స‌మ‌యం ప‌ట్టింద‌ని రాజీవ‌న్ తెలిపారు.

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డికి మొత్తం 64 గ్రామాల‌తో అనుబంధం ఉంది. అనునిత్యం ఆ గ్రామాల‌తో అత‌డు సంబంధాలు కొన‌సాగించేవారు. వాట‌న్నిటినీ క‌ళాద‌ర్శ‌కుడు డిజైన్ చేయాల్సొచ్చింది. ఈ సినిమా కోసం ఏకంగా 42 భారీ సెట్లు వేశారు. ఇందులో విలేజ్ సెట్లు హైలైట్ గా నిలుస్తాయి. ఇక ఇందులో విమానాశ్ర‌యం .. జ‌గ‌న్నాథ కొండ సెట్లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలువ‌నున్నాయ‌ట‌. మెగాస్టార్ చిరంజీవి సినిమా కావ‌డంతో ఈ సినిమా ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కం అని భావించిన సురేంద‌ర్ రెడ్డి తెలివిగా త‌న‌తో ధృవ చిత్రానికి ప‌ని చేసిన రాజీవ‌న్ ని తిరిగి ఎంపిక చేసుకున్నారు. ఆయ‌న‌తో సింక్ బాగా కుద‌ర‌డంతో సైరా లాంటి భారీ చిత్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా షూట్ చేయ‌గ‌లిగార‌ట‌.

జార్జియాలో 1500 మంది బ్రిటీష్ ట్రూప్ ల‌తో వార్ స‌న్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిల‌వ‌నున్నాయ‌ని తెలుస్తోంది. అందుకు సంబంధించిన విజువ‌ల్స్ ని మేకింగ్ వీడియోల్లోనూ చూపించారు. ఒక చారిత్ర‌క క‌థాంశాన్ని ఎంచుకుని సినిమా తీస్తున్నామంటే నేటి టెక్నాల‌జీకి త‌గ్గ‌ట్టు తీయాల్సి ఉంటుంది. అందుకోసం చాలానే శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ట‌. అప్ప‌ట్లో ఆంగ్లేయులు సిల్క్ వ‌స్త్రాల్ని ధ‌రించేవారు. దానికోసం చాలా డ‌బ్బు ఖ‌ర్చు చేసి క్లాత్ ని ఏకంగా డిజైన్ చేయించార‌ట‌. నిర్మాత రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డా రాజీకి రాకుండా ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల‌నే ఇవ‌న్నీ చేయ‌గ‌లిగామ‌ని రాజీవ‌న్ తెలిపారు.