Begin typing your search above and press return to search.

బాలయ్య సినిమాపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

By:  Tupaki Desk   |   16 Jan 2018 8:32 AM GMT
బాలయ్య సినిమాపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
X
హీరో బాలకృష్ణ మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో. అందుకే ఆయన సినిమాల్లో ఫైట్లు మాస్ కు నచ్చేలా ఉండేలా డైరెక్టర్లు రకరకాల సీన్లు తీస్తుంటారు. వీటిలో కొన్ని ప్రేక్షకులను మెప్పించినా మరికొన్ని కాస్తంత అతిగా అనిపిస్తుంటాయి. సోషల్ మీడియా హడావుడి పెరిగిన ఈ రోజుల్లో బాలయ్య సినిమాల్లోని ఇలాంటి సీన్లు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. బాలకృష్ణ లేటెస్ట్ సినిమా జైసింహాలోని ఓ సీన్ ప్రఖ్యాత కార్ల కంపెనీ తయారీదారు అయిన ఆనంద్ మహీంద్రాను దృష్టిని ఆకర్షించింది.

జైసింహాలోని ఓ సీన్ లో బాలయ్య ఒక పోలీసాఫీసర్ తో గొడవ పడాల్సి వస్తుంది. పోలీసాఫీసర్ బెదిరించడంతో కోపాన్ని అదిమిపెట్టుకుని అతడు వచ్చిన బొలేరోను ఒంటిచేత్తో పైకెత్తేస్తాడు. ఈ సీన్ కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. ఇది బొలేరో కారు తయారు చేసే మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాదాకా చేరింది. దీంతో ఆయన ఈ సీన్ ను షేర్ చేస్తూ ఫన్నీగా ఓ ట్వీట్ పెట్టారు. ‘‘హహ.. ఇప్పుడింక మా సర్వీసు వర్కుషాపుల్లో బొలేరో చెకప్ ల కోసం హైడ్రాలిక్ లిఫ్టులు వాడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు!! ’’అంటూ స్వయంగా ట్వీట్ చేశారు.

బాలకృష్ణ గతంలో నటించిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే సీన్ ఉంటుంది. నెటిజన్లు ఎక్కువగా ట్రోల్ చేసే సీన్లలోనూ ఉంటుంది. బాలకృష్ణ కూడా ఆ సీన్ అబ్బర్డ్ గా అనిపిస్తుందని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇప్పుడు మళ్లీ ఒంటిచేత్తే బొలేరో పైకెత్తే సీన్ బాగా వైరల్ అవుతోంది. ఏదేమైనా ఆనంద్ మహీంద్రా లాంటి ఎంటర్ ప్రెన్యూర్ ఓ తెలుగు సినిమా గురించి కామెంట్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి.