Begin typing your search above and press return to search.

రజినీ కూతురికి అరుదైన గౌరవం

By:  Tupaki Desk   |   27 Aug 2016 8:13 AM GMT
రజినీ కూతురికి అరుదైన గౌరవం
X
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇద్దరు కూతుళ్లూ ఘటికురాళ్లే. తండ్రి బాటలో సినిమాల్లో అడుగుపెట్టి తమ టాలెంట్ చూపించే ప్రయత్నం చేశారు. ఇద్దరికీ తొలి ప్రయత్నంలో ఫెయిల్యూర్లు ఎదురైనా వెనక్కి తగ్గట్లేదు. పెద్దమ్మాయి.. ధనుష్ భార్య అయిన ఐశ్వర్య ‘3’ సినిమాతో దెబ్బ తిన్నా.. తర్వాత ‘వై రాజా వై’ సినిమాతో హిట్టు కొట్టింది. ఇప్పుడు తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ లోపు ఆమెకో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి ఆమెను సౌత్ ఇండియాకు గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించింది. మహిళలకు సమాజంలో సమాన ప్రాతినిధ్యం కల్పించడం .. మహిళా సాధికారత మీద కృషి చేయడం లాంటి బాధ్యతల్ని ఆమెకు అప్పగించింది ఐక్య రాజ్యసమితి.

ఐశ్వర్య.. ‘దయా ఫౌండేషన్’ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి బుద్ధి మాంద్యులైన పిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. రజినీకాంత్ పెద్ద ఎత్తున చేపట్టే సేవా కార్యక్రమాల్లోనూ ఆమెది కీలక పాత్ర. ఈ సేవల్ని గుర్తించే ఐక్యరాజ్య సమితి ఆమెకీ కొత్త బాధ్యతలు అప్పగించింది. ఈ ఏడాదే రజినీకాంత్ పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇంతలోనే ఆయన కుటుంబంలోని వ్యక్తికి మరో గౌరవం దక్కింది. రజినీ కుటుంబంలో అందరూ సింపుల్ గా ఉంటూనే మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. రజినీ తన సంపాదనలో సగానికి సగం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తాడన్న సంగతి చాలామందికి తెలియదు. ఆయన వాటి గురించి ప్రచారం చేసుకోకుండా తన పని తాను చేసుకుపోతుంటారు.