Begin typing your search above and press return to search.

ఎనిమిది నిమిషాల సీన్.. 20 కోట్లు

By:  Tupaki Desk   |   27 July 2017 10:38 AM GMT
ఎనిమిది నిమిషాల సీన్.. 20 కోట్లు
X
నాలుగేళ్ల కిందట అమీర్ ఖాన్ నటించిన హిందీ సినిమా ‘ధూమ్-3’లో ఒక పాట కోసం రూ.5 కోట్ల ఖర్చు పెట్టారని వార్తలొస్తే ఔరా అనుకున్నాం. ఐదు నిమిషాల పాటకు ఐదు కోట్లా అని ఆశ్చర్యపోయాం. కానీ ఇప్పుడు మన రీజనల్ సినిమాల్లోని పాటలకే అంతంత ఖర్చు పెట్టేస్తున్నారు. కొన్ని నిమిషాల్లో ముగిసిపోయే సన్నివేశాలకు కూడా కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు టాలీవుడ్లో. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ.12 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని కంటే పెద్ద న్యూసే బయటికి వచ్చింది. 8 నిమిషాల ఒక సీన్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారట.

ఆ సినిమా మరేదో కాదు.. మహేష్ బాబు హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న ‘స్పైడర్’. సైంటిఫిక్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ‘స్పైడర్’ బడ్జెట్ రూ.120 కోట్లన్న సంగతి తెలిసిందే. ఈ 120 కోట్లలో 20 కోట్లు కేవలం ఒక్క సన్నివేశానికే ఖర్చు చేస్తున్నారట. ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న ఎస్.జె.సూర్య ఓ రసాయన బాంబుతో పాఠశాలను నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తాడట. హీరో మహేష్ అతడి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూస్తాడట. ఈ సీక్వెన్స్ ను మురుగదాస్ భారీ స్థాయిలో తెరకెక్కించాడట. ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశానికి ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేసి భారీ స్థాయిలో తెరకెక్కించారట. సినిమాకు ఈ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 27న దసరా కానుకగా ఒకేసారి తెలుగు.. తమిళ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.​