Begin typing your search above and press return to search.

ఏడు సెంటిమెంట్ లేదంటున్న హీరో

By:  Tupaki Desk   |   12 Feb 2016 8:18 AM GMT
ఏడు సెంటిమెంట్ లేదంటున్న హీరో
X
సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్ల పుట్ట. టాలీవుడ్ లో అయితే అసలు వీటికి లెక్కేలేదు. ప్రతీ సెంటిమెంట్ కీ ఓ లెక్కుంటుంది. ఓ లెక్క ప్రకారం సెంటిమెంట్ అయినా ఉంటుంది. అలా చాలామంది హీరోలందరికీ ఉన్న ఓ సెంటిమెంట్ ఏడు. అవును.. తమ ఏడో సినిమాతో చాలామంది స్టార్ హీరోలుగా మారిపోయారు.

మహేష్ బాబు మూవీ ఒక్కడు - పవన్ కళ్యాణ్ ఖుషీ - జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రిల తర్వాతే స్టార్ హీరో అయ్యారు. రామ్ చరణ్ కి కూడా ఏడో సినిమా ఎవడు పెద్ద హిట్ గానే నిలిచింది. మరిప్పుడు ఓ హీరోకి ఏడో సినిమా రిలీజ్ అయింది. గరం అంటూ ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చాడు సాయికుమార్ తనయుడు ఆది. ఈ హీరోకి కూడా ఇది ఏడో సినిమానే. దీంతో నెక్ట్స్ స్టార్ స్టేటస్ వచ్చేస్తుందని ఆశిస్తున్నారా అంటూ.. ఆదికి ప్రశ్నలు ఎక్కువయ్యాయి. 'ఈ 7 సెంటిమెంట్ గురించి నేను కూడా చాలానే విన్నాను. కానీ నాకు ఆ సెంటిమెంట్ పై అంత నమ్మకం లేదు. అయినా అందరూ ఏడో సినిమాతో స్టార్ లు అయిపోతారా' అంటున్నాడు ఆది.

'నేను మహేష్ బాబు లేదా రామ్ చరణ్ ల రేంజ్ కి ఒక సినిమాతో చేరిపోతానని అనుకోవడం లేదు. మంచి స్థాయిని అందుకునేందుకు మెల్లగా సరైన స్క్రిప్టులు ఎంచుకుంటూ సాగుతాను' అంటూ వివరణ ఇచ్చాడు ఆది. ఇలా ఓ మంచి స్క్రిప్ట్ ను ఎంచుకోవడం కోసమే.. ప్రస్తుతం గ్యాప్ తీసుకుని గరం చేసినట్లుగా చెప్పాడు.